కూతురు కాదని వెళితే డిపాజిట్ దక్కదు: కోర్టు
న్యూఢిల్లీ: ఒక వేళ ఒక యువతి తన కుటుంబ, సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా వ్యవహరించి.. వేరే వ్యక్తితో పారిపోయినట్లయితే, ఆమె పేరున డిపాజిట్ చేసిన సొమ్మును తన తల్లిదండ్రులు తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. ఆ యువతి మైనర్గా ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఆమె పేరున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్మును ఆమె ఎవరితోనైనా(తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా) వెళ్లిపోతే ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యూఢిల్లీలోని ట్రయల్ కోర్టు తేల్చి చెప్పింది.
ఇటీవల కూతురు, తండ్రి మధ్య ఇలాంటి వివాదం నెలకొనడంతో ఆ తండ్రి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది. బ్యాంకులో తను డిపాజిట్ చేసిన సొమ్మును మెచురిటీ వచ్చినప్పటికీ తన కూతురుకు శాశ్వతంగా చెల్లించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు ఆ తండ్రి విజ్ఞప్తి చేశారు. ఆమె తనకు ఇష్టం లేకుండా తమ బంధువైన ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని, అందువల్ల ఆమెకు తన సొమ్మును తీసుకునే(డ్రా చేసుకునే) అవకాశాన్ని కల్పించవద్దని కోర్టును కోరారు.
ఈ కేసుపై అదనపు జిల్లా జడ్జి వినోద్ యాదవ్ స్పందిస్తూ.. ‘తన కూతురు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆ తండ్రి బ్యాంకులో సొమ్మును డిపాజిట్ చేశారు. అయితే ఆ కూతురు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా ఆమెకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయింది. అందుకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇలా తనను మోసం చేసి వెళ్లిపోయిన తన పిల్లలకు తను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇవ్వకూడదని నిర్ణయించుకునే హక్కు అతనికి(తండ్రికి) ఉంది' అని పేర్కొన్నారు.
తన కూతురు మైనర్గా ఉన్న సమయంలో ఆమె పేరున అతడు(తండ్రి) ఓ స్టూడెంట్ అకౌంట్ను తెరిచాడు. క్రమంగా ఆ ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు. ఆ అమ్మాయి మేజర్ అయింది. తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయింది. తన పేరున ఉన్న బ్యాంకులో జమైన సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆ తండ్రి కోర్టును ఆశ్రయించాడు.
కాగా, మేజర్ అయిన అతని కూతురుకు బ్యాంకు నియామాల ప్రకారం డబ్బులు తీసుకునే అధికారం ఉంటుందని కోర్టుకు బ్యాంకు తెలిపింది. డబ్బులు వేసిన వారికి ఆ ఖాతాపై ఎలాంటి అధికారం ఉండబోదని కోర్టుకు బ్యాంకు తెలిపింది. అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని కోర్టు తీర్పు తర్వాత బ్యాంకు ప్రకటించింది.