ఆస్తులు అమ్మి ఇన్వెస్టర్ల సొమ్ము చెల్లిస్తాం: సుబ్రతారాయ్
ఆస్తుల అమ్మకాల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని సుబ్రతా రాయ్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో తనకు తానే వాదించుకున్న సుబ్రతా రాయ్, ఆస్తుల అమ్మకాలు జరుగుతాయని, ఆ సమయంలో ఇన్వెస్టర్లకు బ్యాంకు నుంచి గ్యారంటీ ఇప్పిస్తామని కోర్టుకు తెలిపారు. తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తానే కోర్టు ముందు హాజరవుతానని, అప్పుడు కోర్టు ఏ శిక్ష విధించినా స్వీకరించేందుకు తాను సిద్ధమని సుబ్రతా రాయ్ కోర్టుకు తెలిపారు.
ఏడాదిన్నర కాలంగా ఇన్వెస్టర్ల సొమ్మును ఎందుకు చెల్లించలేకపోయారని కోర్టు సుబ్రతా రాయ్ను ప్రశ్నించింది. ఇప్పుడేందుకు మీకు అవకాశం ఇవ్వాలని కోర్టు అడిగింది. సహారా గ్రూపుకు సంబంధించిన ఆస్తులు అమ్మడం అనేది కంపెనీ బాధ్యత, తమ ఆదేశాలు ఖచ్చితంగా అమలు పర్చడం తప్ప ఇంకేమి చేసేది లేదు అని కోర్టు తేల్చి చెప్పింది.
ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టులో హాజరు కానందుకు సుబ్రతా రాయ్ స్వయంగా కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అందుకు వాస్తవమైన కారణం ఉన్నందువల్లే తాను హాజరుకాలేకపోయానని తెలిపారు. తన తల్లికి అనారోగ్యంగా ఉన్నందు వల్లే కోర్టుకు హాజరుకాలేకపోయానని సుబ్రతా రాయ్ కోర్టుకు విన్నవించారు. కాగా, సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్ క్షమాపణలను మన్నించినట్లు పేర్కొంది.