ఆందోళనవద్దు: పన్ను విధానంపై చిదంబరం
పారదర్శకమైన, వివాదాస్పదమైన అంశాలను సులభంగా పరిష్కరించే విధంగా స్థిర, పక్షపాతం లేనటువంటి పన్ను విధానాలను వారికి అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వర్ధమాన దేశాలకు వనరులు, పన్ను రాబడులు ఎంతో కీలకమైనవని చెప్పారు. భారత ప్రభుత్వం కూడా స్థిరమైన పన్ను రేట్లు, చట్టాలకు సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వటంతో పాటు ఎలాంటి పక్షపాతం లేనటువంటి పన్ను విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
పన్నులను మరింత పెంచుకోవటానికి ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషించటం లేదని దీనిపై ఇన్వెస్టర్లు భయాపడాల్సిన అవసరం లేదని చిదంబరం అన్నారు. ఒఇసిడితో కొన్ని టాక్సేషన్ అంశాలను మాత్రం భారత్ చర్చించిందని ఆయన తెలిపారు.
ఇప్పటికే వొడాఫోన్ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం రెట్రాస్పెక్టివ్ (గత తేదీ నుంచి పన్నులు వర్తించే విధంగా) పన్ను సవరణలను కొట్టివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల స్థానంలో డైరెక్ట్ టాక్సెస్ కోడ్ (డిటిసి), గూడ్స్ సర్వీస్ టాక్సెస్ (జిఎస్టి)ను తీసుకురావటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.