రతన్ టాటా కార్పొరేట్ సచిన్ టెండూల్కర్: చిదంబరం
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాను కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రశంసలతో ముంచెత్తారు. భారత కార్పొరేట్ రంగానికి ఆయన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారని కొనియాడారు. పారిశ్రామిక రంగానికి, సమాజానికి అందించిన విశేష సేవలకుగానూ శుక్రవారం ముంబైలో జరిగిన సిఐఐ జాతీయ మండలి సమావేశాల్లో రతన్ టాటాను తొలి సిఐఐ ప్రెసిడెంట్స్ అవార్డుతో చిదంబరం సత్కరించారు.
రతన్ టాటా ఈ అవార్డుకు తగినవారని చిదంబరం అన్నారు. దేశంలో లక్షలాదిగా, విదేశాల్లో వేలాదిగా ఉద్యోగవకాశాలు కల్పించిన ఆయనను మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చివరి మ్యాచ్ ఆడుతున్న వాంఖేడే స్టేడియం ఇక్కడికి సమీపంలోనే ఉందని, అయినా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్పొరేట్లు హజరయ్యారని అన్నారు. క్రికెట్లో సచిన్కు ఉన్నంత ఆదరణ పారిశ్రామిక రంగంలో రతన్ టాటాకు ఉందని ఆయన అన్నారు. ఆయన లాంటి వ్యక్తి పదవి విరమణ చేయకూడదని, కొత్త కొత్త విషయాలు ఆలోచించి అమలు చేయాలని చిదంబరం కోరారు.
ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో పరిశ్రమల పాత్రను ముఖ్యమైనదని అన్నారు. నా ఆశయాన్ని నెరవేర్చుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. భాగస్వాముల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోని రతన్ టాటా.. గత ఏడాది డిసెంబర్ 28న టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యాపార సామ్రాజ్యంలో అన్ని రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ పాత్ర మరువలేనిదని చిదంబరం అన్నారు.
ఒఎన్జిసి చీఫ్ సుధీర్ వాసుదేవ, సిఐఐ అధ్యక్షులు క్రిస్ గోపాలక్రిష్ణన్, ఐటిసి అధినేత వైసి దేవేశ్వర్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ, రాహుల్ బజాజ్, ఆడీ గోద్రేజ్, రామదొరై కూడా రతన్ టాటాను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెప్సికో చైర్పర్సన్, సిఇఒ ఇంద్రానూయి పాల్గొన్నారు. ప్రతి నిర్ణయం చెడు ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తే.. వ్యాపార సంస్థలు మనుగడ సాగించలేవని, అటువంటి పని చేయొద్దని దర్యాప్తు సంస్థలకు ఈ సందర్భంగా చిదంబరం సూచించారు.