కారు కావాలంటే రూ.6లక్షలుండాలి: ఎస్బీఐ
బకాయిల ఎగవేతను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే ఎస్బీఐ రుణ నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా కారు రుణం మంజూరు చేసేందుకు వ్యక్తులకు ఉండాల్సిన కనీస వార్షిక ఆదాయాన్ని రూ.2.5 లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తన బ్యాంకు ఖాతాదారులకు దీని నుంచి కాస్తా ఊరటనిస్తూ వార్షిక ఆదాయం రూ. 4.5లక్షలుంటే సరిపోతుందని ప్రకటించింది.
ప్రస్తుతం ఎస్బీఐ కారు రుణాలపై 10.45శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు కనీస వార్షిక ఆదాయాన్ని రూ. 6లక్షలకు పెంచడం జరిగిందని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు రుణ గ్రహీతలపై రుణం తిరిగి చెల్లించేందుకు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంకు ఆటో రుణాల మొత్తం 8.71శాతం వృద్ధి చెంది 26,411 కోట్ల రూపాయలకు చేరుకుంది.
కరెన్సీ నోట్లను దండలుగా మార్చొద్దు: ఆర్బీఐ
ముంబై: కరెన్సీ నోట్లను దండలుగా గుచ్చి ప్రముఖులను సత్కరించే సంప్రదాయాన్ని మానుకోవాలని రిజర్వు బ్యాంక్ ప్రజలను కోరింది. పెద్దలకు, ప్రముఖులకు సత్కరించేందుకు, మండపాలను తయారు చేయడంలో కరెన్సీ నోట్లను ఉపయోగించరాదని ఆర్బీఐ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ చర్యల వల్ల కరెన్సీ నోట్ల జీవిత కాలం తగ్గిపోతోందని, తొందరగా కళ తగ్గిపోతున్నాయని పేర్కొంది. కరెన్సీ నోట్లను దుర్వినియోగం చేయకూడదని, మన సార్వభౌమాధికారానికి సంకేతమైన కరెన్సీ నోట్లను గౌరవించాలని ప్రజలను కోరింది.