బెంగాల్ను విడిచి వెళ్లే ఉద్దేశం లేదు: టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ
కోల్కత్తా: టాటా గ్లోబల్ బెవరేజెస్ 15వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటాదారులతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ నుండి వెళ్లిపోయే ఉద్దేశం తమకు లేదని టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. టాటాలు ఎప్పుడూ బెంగాల్ను విడిచి వెళ్లలేదు. ఇక ముందు కూడా రాష్ట్రం నుండి వెళ్లబోమని అన్నారు. టాటా మోటార్స్ తన కార్ల తయారీ ప్లాంటును బెంగాల్ నుండి అక్టోబర్ 3, 2008వ తారీఖున గుజరాత్లోని సనందాకు తరలించిన నేపథ్యంలో సింగూరు భూములపై ఆ కంపెనీకి ఉన్న లీజు హక్కులపై విధివిధానాలను తెలపాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన తరుణంలో సైరస్ మిస్త్రీ పై విధంగా స్పందించారు.
టాటా గ్లోబల్ బేవరేజెస్ మరింతగా వృద్ది చెందేందుకు గాను వివిధ బ్రాండ్లలో గణనీయమైన పెట్టబడులు పెడుతుందని మిస్త్రీ తెలిపారు. దేశీయంగా.. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లు ఎగదడం సంతోషంగా ఉందని.. అదే విధంగా కొత్త కొత్త ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా వాటికి తగ్గ నిధులను కేటాయించానని అన్నారు. టాటా గ్లోబల్ బేవరేజెస్లో ప్రముఖ బ్రాండ్లయిన టాటా టీ, టెట్లే, హిమాలయన్ వాటర్, యైటో క్లాక్ కాఫీతో పాటు స్టార్ బక్స్, పెప్సికోతో కలిసి ఏర్పాటు చేయనున్న సంయుక్త సంస్దల పనితీరు చక్కగా ఉందన్నారు.

టాటా స్టార్ బక్స్ జాయింట్ వెంచర్కి దేశ వ్యాప్తంగా ఉన్న 17 విక్రయ కేంద్రాలకు తోడు మరిన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. స్టార్ బక్స్ రాబోయే రెండు సంవత్సరాల్లో లాభ నష్టాలు లేని స్దితికి చేరుకుంటుందన్నారు. మార్కెట్ పరిస్దితులకు అనుగుణంగా అవసరం లేనటువంటి పెట్టుబడుల నుండి టాటా గ్లోబల్ బేవరేజెస్ బయటపడుతుందని వెల్లడించారు. రూపాయి మారకపు విలువ తగ్గడం కంపెనీపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. సింగూర్ భూముల విషయం సుప్రీం కోర్టులో ఉన్నందున దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications