వోడాఫోన్ ఇండియాకు కేంద్ర టెలికాం శాఖ రూ. 100 కోట్ల జరిమానా
కేంద్ర టెలికాం శాఖ అందించిన సమాచారం ప్రకారం భారతీ ఎయిర్ టెల్కు 13 రీజియన్లలో సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ నిబంధనను ఉల్లంఘించడం వల్ల రూ. 650 కోట్లు జరిమానా విధించగా.. వోడాఫోన్ ఇండియాకు మాత్రం ముంబై, న్యూఢిల్లీ రీజియన్లలో నిబంధనను ఉల్లంఘించడం వల్ల రీజియన్కు రూ. 50 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. జూన్ 2003లోనే సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ సర్వీసుని నిలిపివేయాలని టెలికాం శాఖ ప్రస్తావించినప్పటికీ.. హాచ్ (ఇప్పుడు వోడాఫోన్) మాత్రం జాతీయ రౌటింగ్ ప్రణాళికను అతిక్రమించి 2005 వరకూ ఈ సేవలను కొనసాగించడం వల్ల ఈ జరిమానా విధించారు.
ఈ విషయంపై కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ వోడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్కు షోకాజ్ నోటీసులు పంపించినప్పటికీ.. వోడాఫోన్ ఏ మాత్రం స్పందించ లేదు. ఐతే వోడాఫోన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని కొట్టి పారేశారు. ఇది ఇలా ఉంటే వొడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ రెండూ కూడా వేర్వేరు కారణాల వల్ల తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. వొడాఫోన్ దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించాలని ఐటీ శాఖ గట్టిగా పట్టుపడుతోంది. దీనిపై కోర్టు బయట సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వన్ఇండియా మనీ తెలుగు