ప్రపంచ ధనికుల్లో కార్లోస్ స్లిమ్ టాప్.. భారత్లో ముకేష్ అంబానీ
ఫోర్బ్స్ సోమవారం విడుదల చేసిన బిలియనీర్ల 72వ వార్షిక జాబితాలో ప్రపంచం మొత్తం మీద అత్యధిక స్థాయిలో 1,426 మంది స్థానాలను పొందగా, 55 మంది భారతీయులకు చోటు లభించింది. ఇక ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్లో ముకేష్కు 22వ ర్యాంక్ లభించగా, లక్ష్మీ మిట్టల్ 41, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 91వ స్థానాల్లో నిలిచారు. ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ 233 స్దానంతో సరిపెట్టుకున్నారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వరుసగా నాలుగోసారి మెక్సికోకు చెందిన వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ దక్కించుకున్నాడు. 73 బిలియన్ డాలర్ల సంపదతో స్లిమ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. అత్యంత ధనికుల జాబితాలో 67 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ప్రపంచాన రెండో స్థానంలో నిలవగా, స్పెయిన్కు చెందిన ఎమనికో ఓర్టెగా (57 బిలియన్ డాలర్లతో) మూడో ర్యాంక్ను, వారెన్ బఫెట్ (53.5 బి.డా) నాలుగో స్థానాన్ని పొందారు. ఇక 43 బిలియన్ డాలర్ల ఆస్తులతో లారీ ఇల్లిసన్ ఐదో ర్యాంక్ను సొంతం చేసుకున్నారు.
గత ఏడాది కాలంలో ముకేష్ అంబానీ నికర విలువ 100 కోట్ల డాలర్ల మేరకు తగ్గిందని ఫోర్భ్స్ మ్యాగజైన్ పేర్కొంది. అంతేకాకుండా ఆదాయం తగ్గినప్పటికీ.. ఆయన తన స్దానాన్ని కోల్పోలేదని, దేశంలో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నారని వివరించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామిక వేత్తల్లో డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ కె. అంజిరెడ్డి, దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళీ దివి, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎం రావు ఫోర్బ్స్ జాజితాలో చోటు దక్కించుకున్నారు.
తెలుగు వన్ఇండియా