ఆర్థిక మందగమనం ఎఫెక్ట్?: 11ఏళ్లలో మొదటిసారి ముంబై, ఢిల్లీలో ఇలా...
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉంది. గత కొన్ని నెలలుగా ఆటో సేల్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ భారీగా పడిపోయింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్దీపన చర్యలు తీసుకుంది. బడ్జెట్లోను ఊరట ఉంటుందని భావిస్తున్నారు. ఆర్థిక మందగమన ప్రభావం విమానాశ్రయాల ద్వారా కూడా అర్థమవుతోంది. 11 ఏళ్ల తర్వాత మొదటిసారి ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం, ముంబై విమానాశ్రయాలలో ప్రయాణీకుల సంఖ్య పడిపోయింది.
రూ.5 లక్షల వరకు బీమా: ఆరోగ్య సంజీవనిలో పాలసీదారు వాటా 5%
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో గత ఏడాది కంటే తగ్గుదల
2008లో ఈ విమానాశ్రయాలలో ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత అంతకుముందు ఏడాది కంటే మరుసటి ఏడాది ట్రావెలర్స్ సంఖ్య తగ్గింది. 2018 కంటే 2019లో ఢిల్లీ, ముంబైలలో విమాన ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (CSMIA)లల్లోని ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విమానాశ్రయాలలో సంఖ్య పడిపోయింది.
జెట్ ఎయిర్వేస్ మొదలు...
ఆర్థిక మందగమనానికి తోడు గత ఏడాది ఏప్రిల్ నెలలో జెట్ ఎయిర్వేస్ మూతబడింది. వివిధ కారణాలతో ఇతర విమానయానాల్లోను తక్కువ మంది ప్రయాణించారు. గత ఏడాది 138 రోజుల పాటు పాకిస్తాన్ ఎయిర్స్పేస్ క్లోజ్ కావడంతో ముంబై, ఢిల్లీల నుంచి వివిధ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఫలితంగా ఢిల్లీ, ముంబైలలో ఆశించిన ట్రావెలర్స్ పెరగలేదు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎంతమంది ప్రయాణించారంటే
దేశంలోని ఎక్కువ బిజీగా ఉండే విమానాశ్రయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి 2019లో ప్రయాణించిన వారి సంఖ్య 6.98 కోట్లు. 2019లో 2.6 శాతం మేర ట్రావెలర్స్ తగ్గి 6.8 కోట్లకు పరిమితమైంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2019లో 1.9 కోట్ల మంది ప్రయాణీకులు ట్రావెల్ చేయగా, 2018లో ఈ సంఖ్య 1.8 కోట్లుగా ఉంది. ఈ ప్రయాణీకుల సంఖ్య మాత్రం 0.6 శాతం పెరిగింది. డొమెస్టిక్ ప్రయాణీకుల సంఖ్య మాత్రం 2018లో 5.2 కోట్లుగా ఉండగా, 2019లో 4.9 కోట్లుగా ఉంది. ఇది 6 శాతం తగ్గింది.
ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఎంతమంది తగ్గారంటే
ముంబైలోని శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 2018లో 4.98 కోట్ల మంది ప్రయాణిస్తే, 2019లో ఇది 4.7 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది కంటే 5.6 శాతం మేర తగ్గింది. 2019లో ఇక్కడి నుంచి 3.38 కోట్ల మంది డొమెస్టిక్ ట్రావెలర్స్ ప్రయాణించగా 2018లో 3.5 కోట్లుగా ఉంది. అంటే 3.4 శాతం తగ్గింది. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా తగ్గారు. 2018లో 1.4 కోట్లు ఉండగా, 2019లో ఇది 1.3 కోట్లుగా ఉంది. 7 శాతం తగ్గింది.
మొత్తంగా పెరిగింది..
ముంబై, ఢిల్లీల నుంచి జెట్ విమానాలు ఎక్కువగా నడిచేవి. అయితే జెట్ ఎయిర్వేస్ మూసివేతతో నష్టం జరిగింది. అయితే భారత్లోని మిగతా నగరాల విమానాశ్రయాల నుంచి మాత్రం ప్రయాణీకుల సంఖ్య తగ్గలేదు. జనవరి - నవంబర్ DGCA డేటా ప్రకారం 2019లో 11 నెలల కాలంలో 13.1 కోట్ల మంది డొమెస్టిక్ ట్రావెలర్స్ ప్రయాణించారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 12.6 కోట్ల మంది ప్రయాణించారు. అంటే 4 శాతం పెరిగింది. అదే సమయంలో జనవరి-జూన్ డేటా ప్రకారం 2018లో 3.15 కోట్ల మంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ప్రయాణిస్తే 2019లో 1.2 శాతం పెరిగి 3.19 కోట్లకు చేరుకుంది.