భారత సంస్థలు, ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు భారీ సాయం
కరోనా మహమ్మారి కారణంగా చితికిపోయిన భారత్లోని 15 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీ(MSME)లకు ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు/రూ.5,670 కోట్లకు పైగా బడ్జెట్ సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు బుధవారం తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అన్ని దేశాల్లో డిమాండ్ పడిపోయి ఉత్పత్తి నిలిచిపోయి, లాక్ డౌన్ తర్వాత కూడా డిమాండ్ లేమి కారణంగా ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల వరకు సహాయం ప్రకటించింది.
భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు: చైనా-భారత్ ఉద్రిక్తతలపై చాంగ్
ప్రపంచ బ్యాంకు భారీ సాయం
ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రూ.5,670 కోట్ల వరకు బడ్జెట్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా ప్రభావం నుండి బయట పడేందుకు ఎంఎస్ఎంఈలకు రూ.3.7 లక్షలకు పైగా రుణ ప్రణాళికను ప్రకటించడంపై ప్రపంచ బ్యాంకు హర్షం వ్యక్తం చేసింది. బ్యాంకులు, సిడ్బీ ద్వారా కూడా వ్యవస్థలోకి నగదును చొప్పించేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చేపట్టిన చర్యలను ప్రశంసించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మత్ కితాబిచ్చారు.
ప్రభుత్వంతో కలిసి..
కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. మన కరెన్సీలో రూ.20 వేల కోట్లకు పైగా. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. డెవలప్మెంట్ పాలసీ లోన్ కింద కేటాయించే నిధులను, ప్రత్యేకంగా ఏ వ్యయానికి కేటాయించడం లేదని, ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహకారం కోసం ఉంటుందన్నారు.
ద్రవ్య సామర్త్యం పెరుగుతుంది
ఎంఎస్ఎంఈల కోసం కేటాయించే మొత్తం (ప్రపంచ బ్యాంకు ఫండ్) ద్వారా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs)కు ద్రవ్య సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు, లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు ఈ కార్యక్రమం 15 లక్షల ఎంఎస్ఎంఈలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు.