SBI నుండి త్వరగా రుణాలు, జూన్ 1 నుండి సేవలు ప్రారంభం
బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, సూక్ష్మ రుణ అవసరాలను తీర్చడం లక్ష్యంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మైక్రో మార్కెట్స్ (IFMM) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం జూన్ 1వ తేదీ నుండి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. అన్ని ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీస్ (LHO) కార్యాలయ పరిధిలో జనరల్ మేనేజర్ ఈ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తారు.
ఆ దెబ్బతో మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, హైదరాబాద్లో ఎంతంటే
జిల్లాల్లో విక్రయ కేంద్రాలు-ప్రాసెసింగ్ విభాగాలు
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విక్రయ కేంద్రాలు-ప్రాసెసింగ్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ విభాగాల రుణ అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా IFMM విభాగ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలోను ఈ నెట్ వర్క్ను జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేస్తున్నారు.
ఆ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి
మైక్రో ఫైనాన్స్ వ్యాపారంలోకి ప్రవేశించబోతున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. కరోనా సంక్షోభాన్ని కూడా తట్టుకోగలిగిన అతికొద్ది రంగాల్లో మైక్రో ఫైనాన్స్ ఒకటి. దేశంలో సూక్ష్మ రుణాల మార్కెట్ రూ.2.2 లక్షల కోట్ల వరకు ఉంది. అందులో నాలుగో వంతు మార్కెట్ వాటా కోల్కతాకు చెందిన బంధన్ బ్యాంకుది. ప్రస్తుతం బంధన్ బ్యాంక్ సూక్ష్మ రుణాలపై దాదాపు 18% వడ్డీ చార్జ్ చేస్తోంది. HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు 20 శాతానికి పైగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఎస్బీఐ వీటికంటే తక్కువ వడ్డీ రేటుకే సూక్ష్మ రుణాలు అందించే అవకాశముంది.
ఎస్ఎంఈ విభాగం
రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ఎస్బీఐ శాఖల్లో కస్టమర్లకు వేగవంతంగా సేవలు అందించేందుకు జిల్లా స్థాయిలో సేల్స్ హబ్, ప్రాసెసింగ్ సెల్స్తో ఈ నెట్ వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఎస్బీఐ కస్టమర్లకు త్వరగా రుణాలను పంపిణీ చేసేందుకు SME విభాగాన్ని పునరుద్ధరించింది.
ఈ పట్టణాల్లో SME ఏర్పాటు
ఇదే కాకుండా చిన్న, మధ్యతరహా సంస్థలు (SME) రుణ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, వరంగల్లో SME సెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత వేగంగా రుణాలు అందించేందుకు ఈ విభాగాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఓపీ మిశ్రా తెలిపారు. ఎస్బీఐకి తెలంగాణలో 54 SME ఇంటెన్సివ్ బ్రాంచీలు ఉన్నాయి. టర్న్ ఎ రౌండ్ టైమ్ (TAT)ను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు పై నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, వరంగల్) ప్రత్యేకంగా SME సెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.