వలస కార్మికులు, ఎంఎస్ఎంఈలకు రూ.75,000 కోట్ల రిస్క్ ఫండ్!
ఎంఎస్ఎంఈ కార్మికులు, వలస కూలీలు కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కనీసం వారికి ప్రారంభ దశలోనైనా అండగా నిలిచేందుకు రూ.75,000 కోట్ల మూలధనంతో మహమ్మారి రిస్క్ నిధిని ఏర్పాటు చేయాలని ఐఆర్డీఐఏ కార్యాచరణ బృందం ఒకటి సిఫార్సు చేసింది. దీని కింద రూ.75,000 కోట్లతో ప్రభుత్వం నుండి మద్దతు హామీని పొందాలని తెలిపింది. నిధి పరిమాణం అనేది ఎంత మేర నష్టాన్ని పూడ్చాలన్న అంచనాలపై ఆధారపడి ఉంటుందని ఆ బృందం తన నివేదికలో తెలిపింది. ఇండియన్ పాండమిక్ రిస్క్ పూల్ ద్వారా అసంఘటిత, అల్పాదాయ వర్గాలకు ఎదురైన నష్టాలను పూడ్చాలని తెలిపింది.
2019 బెస్ట్, 2020 వరస్ట్: ఒక్కో గదిపై దారుణంగా పడిపోయిన ఆదాయం, హోటల్స్కు వేలకోట్ల నష్టం
భవిష్యత్తులో సమాజంపై తీవ్రప్రభావం చూపే ఈ తరహా మహమ్మారి ఏర్పడిన సమయంలో ఉద్యోగాలు కోల్పోయే అసంఘటిత, అల్పాదాయవర్గ కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ నిధి ఉపయోగకారిగా ఉంటుందని తెలిపింది. కరోనా వల్ల వ్యాపార అంతరాయ నష్టాలు భారీగా ఉన్నాయని, వాటి అంచనా క్లిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తొలి దశ పాండమిక్ రిస్క్ పూల్లో భాగంగా ఎంఎస్ఎంఈ రంగ వేతనాలు, వలస కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక వెల్లడించింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధారణంగా నాలుగు కోట్ల ఉద్యోగాలు, కార్మికులకు గరిష్టంగా మూడు నెలల వేతనాలు ప్రయోజనం లెక్కన, రూ.6,500 రీయింబర్స్మెంట్స్ చొప్పున వీరికి మొత్తం రూ.78,000 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఇటీవల ఇండియన్ న్యూక్లియర్ ఇన్సురెన్స్ పూల్ను పరిగణలోకి తీసుకొని రూ.5000 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తున్నామని, మిగతా రూ.75 వేల కోట్లు ప్రభుత్వం నుండి బ్యాక్ స్టాఫ్ గ్యారెంటీగా రావాలని స్పష్టం చేసింది. తర్వాత మిగతా వ్యాపారాలకూ ఈ కవరేజీని పెంచుకుంటూ వెళ్లాలని తెలిపింది. బ్యాక్స్టాఫ్ గ్యారెంటీని రూ.75వేలకోట్ల నుండి క్రమంగా రూ.1,23,000 కోట్ల వరకు పెంచుకోవాలని సూచించింది.