తక్కువ ధరకే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. రేపే SBI వేలం
దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రేపటి నుండి (డిసెంబర్ 30, బుధవారం) మెగా ప్రాపర్టీ వేలాన్ని ప్రారంభిస్తోంది. తాకట్టులోని ఆస్తులను ఈ-ఎలక్ట్రానిక్ విధానంలో వేలం వేస్తోంది. ఇందులో కమర్షియల్, హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎస్బీఐ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తాకట్టులోని ప్రాపర్టీ వేలం కాబట్టి, మార్కెట్ ధర కంటే కాస్త తక్కువకు ఇళ్లు, ఇతర ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.
Sovereign Gold Bond: నేటి నుండే గోల్డ్ బాండ్ స్కీం, ఆ ధర కంటే రూ.300 తక్కువ
ప్రాపర్టీ ఎక్కడ, ఎంత?
'కొత్తగా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? మీ కోసమే శుభవార్త. ఎస్బీఐ మెగా ఈ-ఆక్షన్ కోసం రిజిస్టర్ చేసుకోండి' అని తాజాగా ఈ రోజు ట్వీట్ చేసింది.ఎస్బీఐ వేలం వివరాలు తెలుసుకోవడానికి https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/bank-e-auctions దీనిని చూడాలి.
ఈ పేజీలో చివరలో మరింత సమాచారం కోసం ఈ కింది లింక్స్ పైన క్లిక్ చేయాలని ఉంటుంది. అక్కడ నాలుగు లింక్స్ ఉంటాయి. అందులో ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎంత, ఈఎంఐ ఎంత అనే వివరాలు తెలుసుకోవచ్చు.
రుణాలు ఇలా వసూలు
అప్పులు తీసుకొని దివాలా తీసిన వారి తనఖా ఆస్తులను విక్రయిస్తున్నామని, బ్యాంకు రుణాలను ఇలా వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. వేలంలో పాల్గొనే వారు నోటీస్లో సూచించిన విధంగా ఎలక్ట్రానిక్ మనీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు కేవైసీ పత్రాలు సంబంధిత ఎస్బీఐ బ్రాంచీలో సమర్పించాలి.
డాక్యుమెంట్స్ బ్రాంచీల్లో ఇచ్చాక వినియోగదారులకు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఈ-మెయిల్ చేస్తారు. వేలం జరిగే సయయంలో బిడ్డర్స్ లాగిన్ అయి, తమ బిడ్స్ దాఖలు చేయవచ్చు. ప్రస్తుత వేలంలో 3317 ఇళ్ళు, 935 కమర్షియల్ కాంప్లెక్స్లు, 513 పారిశ్రామిక సముదాయాలు, 9 వ్యవసాయ క్షేత్రాలను ఉంచింది.
కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్
కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా కొత్త ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం ఇండివిడ్యువల్స్ అవకాశం కలిగి ఉన్నారు. బిడ్డింగ్ ధర మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఎస్బీఐ నుండి డబ్బులు తీసుకొని చెల్లించని వారికి చెందిన ప్రాపర్టీస్ కాబట్టి వాస్తవ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేలం ద్వారా ఎస్బీఐ ఈ ప్రాపర్టీస్ కోసం ఇచ్చిన రుణాలను ఇలా రికవరీ చేస్తోంది.