SBI యోనో యాప్తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలును పలుమార్లు పొడిగించిన ఐటీ శాఖ క్రితంసారి డిసెంబర్ 31, 2020 వరకు ఉండగా, మరో పది రోజుల వెసులుబాటు కల్పించింది. ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం కల్పించింది. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు ఐటీఆర్ దాఖలు విషయంలో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ కస్టమర్లు ఉచితంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు!
చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు కానీ..
యోనో యాప్ ద్వారా ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చునని ఎస్బీఐ గత నెలలో ట్వీట్ చేసింది. సేవింగ్తో పాటు ఐటీఆర్ ఫైలింగ్ కూడా... అంటూ ఈ ట్వీట్ చేసింది. ఐటీ రిటర్న్స్ ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత మంచిది. చివరి నిమిషంలో హడావుడి వల్ల కొన్ని డాక్యుమెంట్స్ దొరకక పోవడం, మరిచిపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు. ఇప్పటికే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉండాలి. వారం మాత్రమే ఉన్నందున దాఖలు చేయని పక్షంలో యోనో యాప్ ఉంటే ఉచితంగా ఫైల్ చేయవచ్చు.
ఇలా ఫైల్ చేయాలి
- మీ స్మార్ట్ఫోన్లో యోనో యాప్ను ఓపెన్ చేసి లాగిన్ కావాలి.
- షాప్ అండ్ ఆర్డర్కు వెళ్లి ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పైన క్లిక్ చేయాలి.
- మరిన్ని వివరాల కోసం tax2win పైన క్లిక్ చేయాలి.
- ఈ పద్ధతిలో సీఏ అసిస్టెడ్ సర్వీసుల కోసమైతే రూ.199 చెల్లించవలసి ఉంటుంది.
- మీకు ఇబ్బందులు ఎదురైతే +91 9660-99-66-55 నెంబర్కు కాల్ చేయవచ్చు.
- లేదా [email protected]కు ఈ-మెయిల్ చేయాలి.
పలుమార్లు గడువు పొడిగింపు
2020-21 అసెస్మెంట్ ఏడాదికి సంబంధించి డిసెంబర్ 26వ తేదీ వరకు 4.15 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ తెలిపింది. సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి ేది జూలై 31. దీనిని తొలుత నవంబర్ 30 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇటీవల మరో పది రోజుల సమయం ఇచ్చారు. దీంతో జనవరి 10 వరకు ఫైల్ చేయవచ్చు.