SBI doorstep banking: ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఇలా పొందండి
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. గతేడాది ప్రారంభమైన కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్ పుంజుకుంది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి ఎక్కువమంది ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. అలాగే డబ్బులు ముట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.
అలాగే, లాక్ డౌన్, కరోనా కఠిన ఆంక్షలు అమలయ్యాయి. దీంతో డిజిటలైజేషన్ పెరిగింది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు కస్టమర్లకు అనుకూలంగా వివిధ సేవలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా SBI డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది.
ఎస్బీఐ ట్వీట్
ఎస్బీఐ ఈ మేరకు ట్వీట్ చేసింది. మీ ఇంటి వద్దకే మీ బ్యాంక్ సేవలు అందుతాయని, ఈ రోజు డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి అని ట్వీట్ చేసింది. ఈ మేరకు బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 1037 188 లేదా 1800 1213 721ను ఇచ్చింది.
ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం కస్టమర్లు ఈ రెండు నెంబర్లతో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇంతవరకు కొంతమంది ప్రయివేటు బ్యాంకు ఖాతాదారులకే ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలు లభించేవి. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇలాంటి సేవల్ని ప్రారంభిస్తున్నాయి.
ఏ సేవలు పొందవచ్చు
నగదు జమ, నగదు ఉపసంహరణ, చెక్కు డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్ చేయడం, ఫామ్ 15హెచ్ అందించడం, టీడీఎస్/ఫామ్ 16 అందివ్వడం, చెక్కు బుక్క్, స్టేట్మెంట్ అందివ్వడం, లైఫ్ సర్టిఫికెట్, టర్మ్ డిపాజిట్ రసీదు వంటి సేవలు ఉన్నాయి.
KYC పత్రాల సమర్పరణ వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం బ్యాంక్ శాఖను సంప్రదించాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేసేందుకు బ్యాంకు నియమించిన సిబ్బందితో మీ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తాయి.
ఛార్జీ ఇలా...
నగదు ఉపసంహరణ సదుపాయాన్ని పొందేందుకు ఖాతాదారు బ్యాంకు ఖాతాను ఆధార్ లేదా డెబిట్ కార్డుతో అనుసంధానం చేయాలి. ట్రాన్సాక్షన్ పరిమితిని కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.20,000లుగా ఉంది. సర్వీస్ ఛార్జ్ కింద ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్కు రూ.60 వసూలు చేస్తారు. జీఎస్టీ అదనం. ఆర్థిక లావాదేవీలకు రూ.100తో పాటు జీఎస్టీ ఉంది.
70 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది.