Postal Scheme: రోజు రూ.416 పొదుపుతో కోటీశ్వరులు కావాలనుందా.. ఈ పోస్టల్ స్కీమ్ మీకు సూపర్.. టాక్స్ లేదు..
Postal Scheme: మార్కెట్ పరిస్థితులతో ప్రభావితం కాని రాబడి కావాలనుకునేవారికి పోస్టీఫీస్ స్కీమ్స్ మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. పైగా వీటిలో పెట్టుబడులు సురక్షితం కూడా. డబ్బును సరిగ్గా ఎలా పెట్టుబడి పెట్టాలో మీకు తెలిస్తే, మిమ్మల్ని ధనవంతులను చేసే అనేక పథకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ కూడా అచ్చం అలాంటిదేనని చెప్పుకోవాలి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ దీర్ఘకాలంలో పెద్ద కార్పస్ మెుత్తాన్ని పొదుపు ద్వారా పోగుచేసుకునేందుకు చాలా సహాయపడుతుంది.
సురక్షితమైన పెట్టుబడి..
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా అస్సలు ప్రభావితం కాదు. ఈ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడునెలలకు ఒకసారి సమీక్షించబడతాయి. పోస్టాఫీసు ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.10 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తోంది.
బ్యాంకు శాఖలో ఖాతా తెరవవచ్చా..
మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను తెరవవచ్చు. కేవలం రూ.500తో ఈ ఖాతా తెరవొచ్చు. ఇందులో ఏటా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లుగా ఉంది. కానీ.. మెచ్యూరిటీ తర్వాత, దానిని 5 సంవత్సరాల బ్రాకెట్లో మరింత పొడిగించుకునేందుకు సదుపాయం ఉంది. ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు కోటీశ్వరుడు అవ్వవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టాలి..
మీరు ప్రతి నెలా పీపీఎఫ్ ఖాతాలో రూ.12,500 జమ చేసి, 15 ఏళ్లపాటు మెయింటెయిన్ చేస్తే మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు. ఇందులో.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు, వడ్డీ ద్వారా రూ. 18.18 లక్షలు మీకు ఆదాయంగా లభిస్తుంది. ఈ లెక్కన వచ్చే 15 సంవత్సరాలకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును అంచనా వేసింది. వడ్డీ రేటు మారినప్పుడు మెచ్యూరిటీ మొత్తం మారవచ్చు.
కోటీశ్వరులు కావటం ఎలా..
మీరు ఈ స్కీమ్ ద్వారా కోటీశ్వరులు కావాలనుకుంటే.. మీరు 15 సంవత్సరాల తర్వాత స్కీమ్ ను 5 సంవత్సరాల కాలానికి రెండుసార్లు పెంచుకోవాలి. అంటే.. ఇప్పుడు మీ పెట్టుబడి కాలవ్యవధి 25 ఏళ్లుగా మారుతుంది. ఈ విధంగా.. 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ. 1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, మీరు వడ్డీ ఆదాయంగా రూ. 65.58 లక్షలు అందుతుంది. అంటే ఒక వ్యక్తి తాను 30 సంవత్సరాల వయస్సులో దీనిని ప్రారంభిస్తే.. అతడు రిటైర్మెంట్ అయ్యే సమయానికి కోటి రూపాయలు సమకూరుతాయి. ఈ క్రమంలో.. PPF ఖాతాను మరింత పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించటం కుదరదు.
టాక్స్ ప్రయోజనం..
PPF పెట్టుబడులకు అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మినహాయింపు తీసుకోవచ్చు. PPFలో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితమైనవి. ఈ విధంగా.. PPFలో పెట్టుబడి 'EEE' కేటగిరీ కిందకు వస్తుంది. వీటికి స్పాన్నర్ కేంద్ర ప్రభుత్వం కావటం వల్ల వడ్డీపై సార్వభౌమ(Sovereign) గ్యారంటీ ఉంటుంది.