మారిన PF అకౌంట్ రూల్, ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పీఎఫ్ ఖాతా నిబంధనలలో మార్పులు తీసుకు వచ్చింది. ఈ మార్పులు జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. అన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సంస్థలకు సందేశాలను పంపించింది. ఆధార్ కార్డుతో అనుసంధానించని ఖాతాలకు ఈసీఆర్ దాఖలు చేయలేరు కాబట్టి సంస్థ కాంట్రిబ్యూషన్ నిలిచిపోతుందని తెలిపింది.
కాబట్టి ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానించాలని సూచించింది. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అన్ని ఈపీఎఫ్ ఖాతాలకు UANను పొందాలని ఈపీఎఫ్ కంపెనీ యజమానులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO మార్గదర్శకాల మేరకు ఆధార్ కార్డు అనుసంధానానికి కావాల్సిన పత్రాలను సంస్థలకు ఇవ్వాలి.
ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా...
ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా ఉద్యోగులు తమ ఆధార్ కార్డును యునివర్సల్ అకౌంట్ నెంబర్(UAN)కు లింక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో దీనిని లింక్ చేసుకునే ప్రాసెస్ తెలుసుకుందాం.
ఆన్లైన్ ద్వారా ఇలా లింక్
- EPFO పోర్టల్ను ఓపెన్ చేయాలి. మీ అకౌంట్లోకి సైన్-ఇన్ కావాలి. UAN, పాస్ వర్డ్ అవసరం. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఎంటర్ చేయాలి.
- మేనేజ్ సెక్షన్లోని KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో Aadhaar కనిపిస్తుంది. అక్కడ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి.
- మీరు ఓసారి ఫామ్ పూర్తి చేసి, సేవ్ చేయాలి. UIDAI మీ ఆధార్ను వ్యాలిడేట్ చేస్తుంది.
- ఓసారి కేవైసీ పూర్తయ్యాక మీ ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు.
ఓటీపీ ద్వారా
EPFO పోర్టల్ను ఓపెన్ చేసి, ఎడమవైపు ఉన్న ఈ-కేవైసి ఆప్షన్ను క్లిక్ చేయాలి.
ఇక్కడ యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఎంటర్ చేయాలి.
జనరేట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. జండర్ని సెలక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ ఆధార్ నెంబరును ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ లేదా ఈ-మెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
వెరిఫికేషన్ కోసం మరోసారి ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
దీంతో ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.