అమల్లోకి EPF కొత్త రూల్స్: కంపెనీల చేతిలో నిధులు, ఉద్యోగుల చేతికి ఎక్కువ శాలరీ!
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలో భాగంగా కంపెనీలు, ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 3 నెలల పాటు చిన్న కంపెనీల ఉద్యోగులకు చెందిన 3 నెలల ఈపీఎఫ్ చెల్లించిన కేంద్రం మరో మూడు నెలలు కూడా చెల్లిస్తోంది. దీంతో పాటు పెద్ద కంపెనీల చేతిలో లిక్విడిటీ కోసం ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈపీఎఫ్ను మూడు నెలల పాటు 10 శాతానికి తగ్గించింది.
కంపెనీలకు పీఎఫ్ చెల్లింపుపై భారీ ఊరట, మరో 3 నెలలు కేంద్రమే చెల్లిస్తుంది
ఉద్యోగులకు పెరగనున్న టేక్ హోమ్, కంపెనీలకు నిధులు
కంపెనీలు మే, జూన్, జూలై నెలలకు గాను ఈపీఎప్ చందాలను 10 శాతం మాత్రమే చెల్లించేలా తగ్గిస్తూ తీసుకు వచ్చిన కొత్త నిబంధనలను కేంద్ర కార్మిక శాఖ నోటిఫై చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీని ఇది పెంచుతుంది. అలాగే పీఎఫ్ బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కంపెనీలకు ఊరట లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కంపెనీలు, ఉద్యోగుల చేతుల్లోకి రూ.6,750 కోట్ల నగదు వస్తుందని అంచనా. అంతేకాదు, కంపెనీలు పీఎఫ్ చెల్లింపులు ఆలస్యమైనా జరిమానా ఉండదని మరో ఊరట కూడా కల్పించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ సంస్థలు యథాతథంగా
ఈపీఎఫ్ చందాల కుదింపు ఈ ఏడాది మే, జూన్, జులై నెలలకు గాను చెల్లించే వేతనాలకు వర్తిస్తుందని సోమవారం జారీచేసిన నోటిఫికేషన్లో కార్మికశాఖ తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు తమ యాజమాన్య ఈపీఎఫ్ఓకు ఎప్పటిలా 12 శాతం చందా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
4.3 కోట్ల ఉద్యోగులు, 6.5 లక్షల కంపెనీలకు ప్రయోజనం
కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్ ప్రకటించినందున సంస్థలు, ఉద్యోగుల చేతుల్లో లిక్విడిటీ పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని, ఈపీఎఫ్ తగ్గింపు కోసం ప్రభుత్వ నోటిఫికేషన్ను సవరించాల్సిన అవసరం ఉందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 4.3 కోట్ల ఉద్యోగులకు, 6.5 లక్షల కంపెనీలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. కంపెనీల చేతుల్లో లిక్విడిటీ ఉంటుంది.
వీరికి వర్తించదు
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKP) కింద 24 శాతం ఈపీఎప్ తోడ్పాటుకు అర్హులైన వారికి పీఎప్ చందాల కుదింపు వర్తించదు. ఎందుకంటే దీనిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. PMGKP పథకం కింద యజమాని వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతం కేంద్రం చెల్లిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చెల్లించిన మోడీ ప్రభుత్వం, మరో మూడు నెలలు పొడిగించి, జూన్, జూలై, ఆగస్ట్లకు కూడా చెల్లించాలని నిర్ణయించింది.