LIC Policy:రోజూ రూ. 85 పొదుపు చేస్తే మంచి రాబడినిస్తున్న పాలసీ..రిస్క్ అస్సలు లేదు..పైగా గ్యారెంటీ బోనస్ కూడా.
LIC Bima Ratna Policy: ఇన్సూరెన్స్ పాలసీ విషయానికి వస్తే.. ముందుగా గుర్తుకు వచ్చే విషయం మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడటం. అటువంటి పరిస్థితిలో.. చాలా మంది జీవించి ఉన్నప్పుడే డెత్ ప్లస్ సేవింగ్ బెనిఫిట్స్ పాలసీలను తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఇందులో మీరు మరణంతో పాటు మీ పొదుపు ప్రయోజనం కూడా పొందుతారు. ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం ప్రారంభించిన ఎల్ఐసీ బీమా రత్న పథకం గురించి ఇప్పుడు తెలుకుందాం..
పాలసీ అర్హత, రాబడి..
LIC బీమా రత్న పాలసీ 15, 20, 25 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. 15 ఏళ్ల పాలసీకి 11 ఏళ్లు, 20 ఏళ్ల పాలసీకి 16 ఏళ్లు, 25 ఏళ్ల పాలసీకి 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవటానికి కనీస వయస్సు అర్హత 90 రోజులు కాగా.. గరిష్ఠ వయస్సు పరిమితి 55 సంవత్సరాలుగా ఉంది. పాలసీదారు మరణించినప్పుడు.. ప్రాథమిక బీమా మొత్తంలో 125% వరకు లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువ పొందుతారు. మరణ ప్రయోజనం మరణించిన రోజు వరకు చెల్లించిన ప్రీమియంలలో కనీసం 105% ఉంటుంది. ఈ పాలసీ నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని ఎల్ఐసీ తెలిపింది
తక్కువ ప్రీమియంతో ప్రయోజనాలు..
ఇది పరిమిత ప్రీమియం, అదనపు హామీ, మనీ బ్యాక్ కలిగిన ఇన్సూరెన్స్ పాలసీ. అంటే.. మీరు తక్కువ ప్రీమియం చెల్లించి, బోనస్ హామీని పొందుతారు. బీమా రత్న పాలసీలోని డబ్బును.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయనందున అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. పాలసీలో హామీ మొత్తం 5 లక్షలు. అంటే కనీసం 5 లక్షల రూపాయల పాలసీ తీసుకోవాలి. ఇందులో గరిష్ఠ పరిమితి లేదు.
బతికి ఉన్న పాలసీదారులకు ప్రయోజనాలు..
ఈ పాలసీ కింద పాలసీదారు మనుగడ ప్రయోజనం కూడా పొందుతారు. అంటే.. ప్లాన్ వ్యవధి ముగిసే వరకు జీవించినట్లయితే ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు 15 సంవత్సరాల కాలవ్యవధితో ప్లాన్ తీసుకున్నట్లయితే.. 13,14 సంవత్సరం చివరిలో ఇన్సూరెన్స్ చేయబడిన ప్రాథమిక మొత్తంలో 25-25% చెల్లించబడుతుంది. ఇదే పద్ధతిని ఇతర కాలపరిమితులకు కూడా వినియోగిస్తారు.
గ్యారెంటీ బోనస్ చెల్లింపు..
ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి పాలసీ గడువు ముగిసేవరకు జీవించి ఉంటే.. వారు ప్రాథమిక బీమా మొత్తంలో 50% పొందుతారు. ఇది మాత్రమే కాకుండా.. 1-5 సంవత్సరాల వరకు ప్రతి వెయ్యికి రూ.50 బోనస్ పొందుతారు. 6-10 సంవత్సరాల వరకు ప్రతి వెయ్యికి ఎల్ఐసీ రూ.55 బోనస్ అందిస్తోంది. 11-25 సంవత్సరాల వరకు ప్రతి వెయ్యికి రూ.60 బోనస్ని గ్యారెంటీగా పొందుతారు.
రోజుకు రూ.85 చెల్లిస్తే.. ఎంత వస్తుంది..
ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సులో రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి, 25 సంవత్సరాల కాలానికి ఎల్ఐసీ బీమా రత్న పాలసీని తీసుకుంటే రాబడి ఎలా ఉంటదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంలో.. వారు 21 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి దాదాపు రూ.30,900 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కాలంలో పాలసీదారు మెుత్తం రూ.6,49,559 ప్రీమియం చెల్లిస్తాడు. సదరు వ్యక్తి మరణించినట్లయితే.. బీమా మొత్తంలో 125% వరకు చెల్లించబడుతుంది. అతడు బతికి ఉన్నట్లయితే.. 23వ ఏట రూ.1.25 లక్షలు, 24వ ఏట రూ.1.25 లక్షలు అందుతాయి.
దీని తర్వాత.. 25 ఏట పాలసీ మెచ్యూరిటీ సమయంలో మిగిలిన రూ. 2.5 లక్షలు అందుకుంటాడు. దీనికి తోడు అతనికి దాదాపు రూ.7,12,500 బోనస్ లభిస్తుంది. అంటే మొత్తం 25వ సంవత్సరంలో దాదాపు రూ.12,12,500 అందుతుంది.