LIC Policy: మహిళలకు LIC స్పెషల్.. రోజూ రూ.29 చెల్లిస్తే రూ.4 లక్షల రాబడి.. పూర్తి వివరాలు
LIC Policy: భారతీయులకు పొదుపు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పోస్టాఫీస్ స్కీములు లేదా ఎల్ఐసీ అందించే వివిధ పాలసీలు. అందులోనూ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేక పాలసీలను అందుబాటులో ఉంచింది. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అన్ని వయస్సుల వారికీ ప్రత్యేక స్కీమ్స్ ఎల్ఐసీ వద్ద ఉన్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మహిళలు, ఆడపిల్లల కోసం అందిస్తున్న ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్(LIC Aadhaar Shila Plan) గురించి. దీనిలో ఎంత పెట్టుబడి పెట్టాలి, రాబడి ఎలా ఉంటుంది వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ మెుత్తం పొదుపుతో..
అసలు ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ ప్రత్యేకత ఏంటంటే.. ఈ పాలసీలో చాలా తక్కువ మెుత్తంలో అంటే కేవలం రోజుకు రూ.29 చొప్పున పొదుపు చేసుకున్నట్లయితే మెచ్చూరిటీ సమయంలో పాలసీదారులకు రూ.4 లక్షలు వస్తాయి. ప్రస్తుతం అతి తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న ప్లాన్ ఇదేనని చెప్పుకోవచ్చు. దీనిని ప్రత్యేకంగా మహిళలు, ఆడపిల్లల కోసం మాత్రమే ప్రత్యేకం.
పాలసీ ఓపెన్ చేయటం ఎలా..
ఈ పాలసీని కొనుగోలు చేయటానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం. దేశవ్యాప్తంగా ఆధార్ తప్పనిసరి చేసిన తరువాత ప్రస్తుతం అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎటువంటి ఆరోగ్య పరీక్షలు లేకుండా ఆధార్ శిల పాలసీని మహిళలు సులువుగా కొనుగోలు చేయవచ్చు.
కనీస వయస్సు పరిమితి ఎంత..
ఈ పాలసీని కొనుగోలు చేయటానికి కనీస వయస్సు అర్హత 8 ఏళ్లుగా ఎల్ఐసీ నిర్ణయించింది. అదే గరిష్ఠంగా 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. పాలసీని 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల గడువుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీలో కనీసం రూ.75,000 సమ్ అష్యూర్డ్ నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. పాలసీదారు నెలవారీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఏడాదికొకసారి ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంది.
పాలసీ ప్రయోజనాలు..
పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే రిస్క్ కవర్ ఉండటం ఇందులో స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. పాలసీని కొనుగోలుచేసిన ఐదేళ్ల లోపు సదరు వ్యక్తి మరణిస్తే సమ్ అష్యూర్డ్కు 110 శాతం నామినీకి అందిస్తారు. పాలసీహోల్డర్ ఐదేళ్ల తర్వాత మరణిస్తే సమ్ అష్యూర్డ్తో పాటు లాయల్టీ అడిషన్ కూడా కలిపి చెల్లించటం జరుగుతుంది. ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకునేవారికి ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.
రూ.4 లక్షలు ఎలా వస్తాయి..?
ఉదాహరణకు.. ఒక మహిళ 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 20 ఏళ్ల కాలానికి ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకున్నట్లయితే ఏడాదికి రూ.10,585 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రోజుకు కేవలం రూ.29 చెల్లిస్తే 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,14,696 అవుతుంది. ఆ తరువాత మెచ్యూరిటీ సమయంలో పాలసీదారునికి రూ.3,97,000 వరకు రాబడి వస్తుంది.
ఎక్కువ ప్రీమియం చెల్లించలేకపోతే.. ఎలా..
ఎక్కువగా ప్రీమియం చెల్లించలేని వారు కేవలం లక్ష రూపాయల సమ్ అష్యూర్డ్తో కూడా పాలసీ తీసుకోవచ్చు. 35 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 20 ఏళ్లకు ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఏడాదికి రూ.3,709 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వారు మెుత్తం కాలానికి రూ.74,180 చెల్లించాల్సి ఉంటుంది. చివరికి మెచ్యూరిటీ సమయంలో రూ.16,500 బోనస్ తో పాటు లక్ష రూపాయల సమ్ అష్యూర్డ్ కలిపి అందించటం జరుగుతుంది. అంటే వారి చేతికి చివరికి రూ.1,16,500 రాబడిగా అందుతుంది.