ఫ్రాడ్స్ నుండి రక్షించే ఎస్బీఐ ఏటీఎం ఆధారిత నగదు ఉపసంహరణ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు OTP ద్వారా ఎస్బీఐ నగదు ఉపసంహరణను అందుబాటులోకి తెచ్చింది. రూ.10,000 అంతకుమించి నగదును ఉపసంహరించుకోవడానికి ఓటీపీ ఆధారిత విత్డ్రాను తీసుకు వచ్చింది. అంటే కస్టమర్లు ఏటీఎం నుండి నగదును తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ను కచ్చితంగా తీసుకు వెళ్లాలి. బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అనధికార ట్రాన్సాక్షన్స్ను లేదా ఫ్రాడ్ జరగకుండా చేసేందుకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. '24x7 ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్బీఐ ఎటీఎం నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత పటిష్టం చేసింది. ఈ సదుపాయాన్ని రోజంతా అమలు చేయడం వలన ఎస్బీఐ డెబిట్ కార్డ్ హోల్డర్స్... ఫ్రాడ్స్టర్స్, అనధికారిక ఉపసంహరణలు, కార్డ్స్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి వాటి బారిన పడే ప్రమాదాన్ని నిరోధించవచ్చు.' అని ఎస్బీఐ గత ఏడాది ఓ ప్రకటనలో తెలిపింది.
ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ
ఎస్బీఐ ఇటీవలి ట్వీట్ ప్రకారం ఎస్బీఐ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కోసం తమ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ ఫ్రాడ్స్టర్స్కు అడ్డుకట్ట వేసే విధమైన చర్య అని, ఇది మోసాల నుండి ఎప్పుడూ రక్షిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణ సిస్టమ్ సెప్టెంబర్ 18వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. అంటే ఓటీపీ లేకుండా నగదు ఉపసంహరణ సాధ్యం కాదు. ఓటీపీ ఆధారిత సేవలు అంతకుముందు అంటే 2020 జనవరి నుండే అమల్లోకి తెచ్చింది. అయితే ఇది రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉపసంహరణ చేసే ట్రాన్సాక్షన్స్ పైన ఉండేది. గత ఏడాది సెప్టెంబర్ నుండి 24X7 ఇది అమల్లోకి వచ్చింది.
ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ
- ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సురక్షితమైనది. రూ.10,000 అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే ఓటీపీ ఆధారిత సేవలు ఉన్నాయి.
- సేవింగ్స్ అకౌంట్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు.
- ఓటీపీ ఆధారిత సేవలు పొందడానికి కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ను అప్ డేట్ చేయడం తప్పనిసరి. బ్యాంకులో ఏ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అందుకే మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవాలని ఎస్బీఐ ఇదివరకే సూచించింది.
- ఇది ఏటీఎం నగదు ఉపసంహరణకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఎస్బీఐ ఏటీఎంల నుండి చేసే ట్రాన్సాక్షన్స్కు వర్తిస్తుంది. ఇతర బ్యాంకులకు వర్తించదు.
ఇలా ఉపసంహరణ
- కార్డు హోల్డర్ ఎస్బీఐ ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకోవాలని భావిస్తే ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో వస్తుంది. ట్రాన్సాక్షన్ పూర్తి కావడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది సింగిల్ ట్రాన్సాక్షన్కు మాత్రమే వర్తిస్తుంది.