నేడే ఆర్థిక సర్వే: ఏమిటిది, ఎందుకు అంత ప్రాధాన్యత, ఎవరు తయారు చేస్తారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతాయి. బడ్జెట్కు ముందు.. ఈ రోజు ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. 15వ ఆర్థిక సంఘం తాత్కాలికంగా నివేదికు కూడా ఈ సమావేశాల్లో సభ ముందు ఉంచవచ్చు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రావాల్సి ఉండగా, కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఇచ్చి తాత్కాలిక నివేదికను సభ ముందు ఉంచి ఆమోదం తీసుకోనుంది. ఆర్థిక సంఘం నివేదికతో పాటు ఆర్థిక సర్వేను (ఎనకమిక్ సర్వే) ప్రవేశ పెడుతారు. మరి ఆర్థిక సర్వే అంటే...
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
ఏమిటీ ఆర్థిక సర్వే?
బడ్జెట్కు ఒక రోజు ముందు వెల్లడయ్యే ఆర్థిక సర్వేకు ఎంతో ప్రాధాన్యత. గడిచిన ఏడాది కాలానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుంది. సవాళ్లు, పరిష్కారాలకు సంబంధించిన నివేదిక ఇది. వ్యవస్థలోని వివిధ రంగాల పరిస్థితిని ఇది తెలుపుతుంది. దీని ద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతుంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలు పట్టేందుకు చేయాల్సిన విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలో సూచిస్తుంది.
కచ్చితంగా పాటించాలని లేదు..
చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (CEA) ఆర్థిక సర్వేను రిలీజ్ చేస్తారు. ప్రభుత్వ పథకాలపై CEA అభిప్రాయాలను, వృద్ధికి అవసరమైన చర్యలను ఇందులో పొందుపరుస్తారు. అయితే ఈ సిఫార్సులను అనుసరించాలనే నిబంధన లేదు. వివిధ ఆర్థిక సర్వేల్లోని సూచనలు ఆయా బడ్జెట్లలో పాటించలేదు.
రెండు భాగాలుగా...
ఎకనమిక్ సర్వే రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో కీలక అంశాలపై CEA అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలుంటాయి. ఆర్థిక వ్యవస్థపై సమీక్ష ఉంటుంది. ఇక రెండో భాగంలో మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన గణాంకాలు ఉంటాయి. వీటిని అన్నింటిని CEA అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.
ప్రజలకు ఆర్థిక పరిస్థితి, విధానాలపై అవగాహన
ఎకనమిక్ సర్వే లేదా ఆర్థిక సర్వే వెల్లడి ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక విధానాలపై అవగాహన వస్తుంది.
ఎకనమిక్ సర్వేను ఎవరు తయారు చేస్తారు?
ఆర్థిక సర్వేను CEA, ఆయన బృందం తయారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్కు ముందు రోజు దీనిని ప్రవేశ పెడతారు. CEA డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ నేతృత్వంలోని ఎకనమిక్ డివిజన్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ దీనిని సిద్ధం చేస్తుంది. దీనిని సిద్ధం చేశాక ఆర్థికమంత్రి అప్రూవల్ తీసుకుంటారు.
1964 తర్వాత విభజించి..
1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వేను తీసుకు వచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్తో పాటు ప్రవేశ పెట్టినప్పటికీ, ఆ తర్వాత విభజించారు. గత కొన్నేళ్లుగా ఎకనమిక్ సర్వేను రెండు విభాగాలుగా తీసుకు వస్తున్నారు.