ఇంటికి పెన్షన్ నుండి సొంతిల్లు వరకు.. ఫిబ్రవరిలో వరుసగా జగన్ గుడ్న్యూస్లు
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు శుభవార్త. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మీ పెన్షన్ మీ ఇంటి వద్దకే రానుంది. మీరు కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. అదే రోజు కొత్త పెన్షన్లు కూడా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి జగనన్న విద్యా వసతి దీవెనను ప్రారంభిస్తారు. అదే రోజు మొదటి విడతను, జూలై-ఆగస్ట్ నెలల్లో రెండో విడత అందిస్తారు.
భారత్లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా?
54.64 లక్షల మంది లబ్ధిదారులు
ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు పెన్షన్దారులు 39 లక్షలు ఉన్నారు. ఇప్పుడు మరో 15 లక్షలకు పైగా జత అయ్యారు. మొత్తం 54.64 లక్షల మందికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెన్షన్ మొత్తం ఇంటి వద్దకే రానుంది. గ్రామ, పట్టణ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ సొమ్మును అందిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా..
కొత్తగా బియ్యం కార్డులు, పెన్షన్ అర్హుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 21 వరకు వీటిని పంపిణీ చేయనున్నారు. నిర్ణీత సమయానికి కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేయాలి. సామాజిక తనిఖీ ఫిబ్రవరి 2వ తేదీ వరకు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత కార్డుల పంపిణీ చేపట్టాలి. ఆ తర్వాత కూడా అర్హులు మిగిలి ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు మంజూరు చేస్తారు.
ఇళ్ల స్థలాలకు అర్హుల జాబితా
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాను ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎంపిక చేయాలని కూడా సీఎం ఆదేశించారు. 2006 నుంచి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇళ్లస్థలాల ఖరారుకు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజల అంగీకారం అవసరం. 25వ తేదీ నాటికి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తవ్వాలి. మార్చి 1 నాటికి భూసేకరణ, 10వ తేదీ నాటికి వాటిలో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. 15వ తేదీ నాటికి లాటరీలు తీసి ప్లాట్లు కేటాయించాలి. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉండేవారికి ప్లాట్ల కేటాయింపు ఎక్కడో చెప్పడంతో పాటు మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యమివ్వాలి.
రైతులకు అండగా...
ఏప్రిల్ నెలాఖరి నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. నాణ్యమైన పురుగుల మందు, విత్తనాలు, ఎరువులను గ్రామాల్లోనే అందించడంతో పాటు రైతులు పంటవేసే సమయానికి గిట్టుబాటు ధరలు అందేలా చూస్తామని జగన్ ప్రకటించారు. ఫిబ్రవరి 28 నాటికి 3,300 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో 7వేలు ప్రారంభించి, అదే నెలాఖరు నాటికి గ్రామ సచివాలయాల వద్దే 11వేలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఎప్పటికీ ఉంచాలి. అవకాశం కోల్పోయిన వారికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తారు. అన్ని పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.
ఆరోగ్య ధీమా
వైయస్సార్ కంటి వెలుగు మూడో విడతను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూలై 31 వరకు కొనసాగిస్తారు. ఫిబ్రవరి నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. వచ్చే నెలలో 4,900కు పైగా కొత్త ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలు ప్రారంభిస్తారు.
ఏడాదికి రూ.10వేల నుంచి రూ.20వేలు
జగనన్న వసతి దీవెన ద్వారా దాదాపు 11.60 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 20న ప్రారంభించనున్నారు. మొదటి విడత కింద ఫిబ్రవరిలో డబ్బులు అందిస్తారు. జూలై-ఆగస్ట్లో రెండో విడత ఇస్తారు. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని విద్యార్ధుల తల్లులకు అందిస్తారు. జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి... ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సు విద్యార్థులకు రూ.20 వేలు ఇస్తారు.
అమ్మ ఒడి
అమ్మఒడి కింద 42,33,098 మంది తల్లులను గుర్తించారు. ఈ స్కీం ద్వారా రెండు రోజుల క్రితం వరకు 41,25,808 మందికి రూ.6,188 కోట్లు పంపిణీ చేశారు. మిగతా 1,07,290 అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ విఫలమయ్యాయి. కారణాలు పరిశీలించి దీనిని సరిదిద్దనున్నారు.
మధ్యాహ్న భోజన నాణ్యతకు యాప్
మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్లు తనిఖీ చేయాల్సి ఉంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీలో ఆర్డీవో స్థాయి అధికారికి ఈ స్కీం పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యతను పరిశీలించేందుకు రెండు వారాల్లో యాప్ను అందుబాటులోకి తేనున్నారు. ఆయా జిల్లాల్లో నిర్ణయించిన తేదీల ప్రకారం ఇసుకను ఇంటికే చేరుస్తారు. 48-72 గంటల్లో ఇంటి వద్దకు చేరుస్తారు.
ఏ సేవ ఎప్పుడో ప్రజలకు తెలిసేలా...
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 వరకు సేవలు అందిస్తున్నారు. ఇందులో 336 సేవలను కేవలం 72 గంటల్లో పూర్తి చేస్తారు. కొన్ని పావు గంటలో పూర్తయ్యేవి ఉన్నాయి. మిగతా సేవలకు కూడా కాల వ్యవధి నిర్ణయించారు. ఏ సేవ ఎన్ని రోజుల్లో అందిస్తారనే వివరాలు గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. దరఖాస్తుల స్వీకరణ, రశీదులు, పరిష్కారం అంతా డ్యాష్ బోర్డుల్లో కనిపించాలని ప్రభుత్వం ఆదేశించింది.