దేశంలో తొలిసారి.. జగన్ కొత్త స్కీం: వారికి రోజుకు రూ.225: రాకుంటే ఇలా చేయండి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సరికొత్త పథకం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. అలాంటి వారు విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు లేక ఇబ్బందులు పడతారు. అలాంటి వారి కోసం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారు.
'జగనన్న' రెండు స్కీమ్లు: ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తించదు... షరతులివే
ఆరోగ్యశ్రీ ఆసరా కింద రోజుకు రూ.225
ఆపరేషన్ అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలు ఈ పథకం ద్వారా అందిస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడంలో దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలోని పెద్దలు ఎవరైనా జబ్బుపడితే ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో ప్రతి సంవత్సరం లక్షలాదిమంది లబ్ధి పొందుతారని భావిస్తున్నారు.
48 గంటల్లో గంటల్లో డబ్బులు జమ
ఆపరేషన్ చేయించుకున్న వారు డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాలోకి ఈ సాయం మొత్తాన్ని జమ చేస్తారు. సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా జగన్ కొంతమంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఉపాధి లేని రోగులు పస్తులు ఉండకుండా చేసేందుకు ఈ పథకం తెచ్చినట్లు జగన్ చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
డబ్బులు అందకుంటే ఏం చేయాలి?
ఆపరేషన్ చేయించుకున్న రోగులకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు గరిష్టంగా ఆర్థిక సాయం చేస్తారు. అయితే అర్హులైన వారు ఎవరికైనా ఈ నగదు అందకుంటే వారు టోల్ ఫ్రీ నెంబర్ 104కు ఫోన్ చేయవచ్చు.
ఆరోగ్య ఆసరా స్కీం వివరాలు.. క్లుప్తంగా
వైయస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. వైయస్సార్ ఆసరా వివరాలు...
మొత్తం స్పెషాలిటీ విభాగాలు - 26
ఎన్ని రకాల శస్త్ర చికిత్సలు - 836
రోజుకు ఇచ్చే మొత్తం - రూ.225
నెల రోజుల విశ్రాంతికి - రూ.5000
లబ్ధిదారుల సంఖ్య - నాలుగు లక్షలకు పైగా
ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు - రూ.300 కోట్లు
రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ
ఇప్పటికే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1200 రోగాలు పెంచారు. మొత్తం 2వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఆ తర్వాత దశలవారీగా 2వేల వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం వర్తింప చేస్తారు. రూ.1000 ఖర్చు దాటితే పథకం వర్తింపచేస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. జనవరి 1 నుంచి తలసేమియా, సికిల్ సెల్ రోగులకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తారు.