కేబుల్ కస్టమర్లకు గుడ్న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదు, కనెక్షన్ గరిష్ట ఫీజు రూ.160
టెలికం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) 2017 చట్టంలో చేసిన మార్పులు మార్చి 1, 2020 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ప్రకటించారు. మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఈ కొత్త నిబంధనలు కన్స్యూమర్ ఫ్రెండ్లీగా ఉన్నట్లు తెలిపారు. కొత్త చట్టానికి సంబంధించిన సవరణల్ని ట్రాయ్ జనవరి 1న నోటిఫై చేసింది.
SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్లోన్ స్కీం: ప్రయోజనమెలా?
ఏ ఛానల్ అయినా.. తక్కువ ధరకే
మార్చి 1వ తేదీ నుంచి ఇది అమలయ్యాక, వినియోగదారులకు ఏ ఛానెల్ కావాలన్నా ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు, ఈ కొత్త చట్టంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుకే ఛానెల్స్ ఎంపిక చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు.
ఉచిత ఛానల్స్ను పేయిడ్ ఛానల్స్గా
ట్రాయ్ ఎప్పుడు కూడా ఛానల్స్ను నియంత్రించదని, దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ కూడా తప్పుడు ప్రచారమేనని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ కొట్టి పారేశారు. ప్రస్తుతం దేశంలో 38 బ్రాడ్కాస్టర్లు ఉన్నారని, అందులో 5గురు తమ ఉచిత ఛానల్స్ను పేయిడ్ ఛానల్స్గా మార్చారని చెప్పారు.
పే ఛానల్ ధర రూ.12కు మించవద్దు
మొత్తం 909 ఛానల్స్ అందుబాటులో ఉండగా అందులో 330 పెయిడ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పారు. కేబుల్ టీవీల ద్వారా ప్రసారం చేసే పే ఛానల్ గరిష్ఠ ధర రూ.12కు మించవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొన్ని పే ఛానల్స్ బొకేలో ఒక ధరకు, అలాకార్టేలో ఒక ధరకు విక్రయిస్తున్నాయన్నారు.
వినియోగదారుడు నష్టపోతున్నాడనే...
అలాకార్టేలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ, బొకేలో రాయితీ పేరుతో తక్కువకు ఇస్తున్నాయని, దీంతో వినియోగదారుడు నష్టపోతున్నాడని చెప్పారు. దీనిని సరిదిద్దేందుకు ఏ రూపంలో ఇచ్చిన పే ఛానల్ గరిష్ఠ ధర రూ.12 మించకూడదని నిబంధన విధిస్తున్నట్లు తెలిపారు.
రూ.160కి మించకూడదు
200 ఎస్డీ ఛానళ్ల ప్రాథమిక నెట్ వర్క్ కనెక్షన్ ఫీజు నెలకు రూ.130గా నిర్ధారించినట్లు చెప్పారు. అంతకుమించి ఎన్ని ఛానల్స్ ఇచ్చినా నెట్ వర్క్ కనెక్షన్ ఫీజు గరిష్ట పరిమితి రూ.160కి మించకూడదని స్పష్టం చేశారు.
రెండో టీవీ ఉంటే...
ఇంట్లో ఒకటికి మించి టీవీలు ఉండి, రెండో టీవీకి కూడా కనెక్షన్ తీసుకుంటే నెట్ వర్క్ కనెక్షన్ ఫీజు 40 శాతానికి మించవద్దని చెప్పారు. అలాకార్టే, బొకే ఛానల్స్ మధ్య హేతుబద్దమైన సంబంధం ఉండాలని, వీటి ధరలను ఇష్టారీతిన నిర్ణయించడానికి వీల్లేదన్నారు.
ఛార్జీలు మార్చుకోవచ్చు
డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాం ఆపరేటర్లు తాము సేవలు అందించే ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో నెట్ వర్క్ కనెక్షన్ ఛార్జ్ వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. దీంతో స్థానిక అవసరాలకు తగినట్లు ఆపరేటర్లు ఛార్జ్ వసూలు చేసుకోవచ్చునని చెప్పారు. దీంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరలు నిర్ణయించవచ్చు.
రాయితీ ఇచ్చుకోవచ్చు
ఆరు నెలలు, అంతకుమించిన దీర్ఘకాల చందాదారులకు ఎన్సీఎఫ్, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరలపై రాయితీ ఇవ్వవచ్చునని ఆర్ఎస్ శర్మ తెలిపారు. డీటీహెచ్, ఇతర వ్యవస్థలపై ఒక్కో ఎస్డీ ఛానల్ క్యారేజీ గరిష్ఠ ధరను నెలకు రూ.4 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ఇది వార్తా, ప్రాంతీయ ఛానళ్లకు అందుబాటులో ఉంటుంది.
మార్చి 1 నుంచి అమలు
కొత్త కేబుల్ ఛార్జీ విధానం మార్చి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కొత్త అలాకార్టే, బొకే ఛానల్స్ ధరలను జనవరి 15 వరకు ప్రచురించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాం ఆపరేటర్లు సవరించిన ధరలను తమ వెబ్ సైట్లో జనవరి 30 వరకు ఉంచాలని ఆదేశించారు.