ఏపీలో జనవరి 1 నుంచి అన్ని సేవలు గ్రామసచివాలయాల్లో: మినిమం ఛార్జ్
అమరావతి: సంక్షేమ పథకాలు, సేవలు ప్రజల ముంగిటకు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. వీటిలో జనవరి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిసెంబర్ 26వ తేదీ నుంచి కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సచివాలయాల్లో సిబ్బంది, అధికారుల నియామకం పూర్తయింది.
తెలుగు రాష్ట్రాలకు ఎయిర్టెల్ గుడ్న్యూస్
జనవరి 1 నుంచి అందుబాటులోకి..
కొత్తగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి (జనవరి 1, 2020) నుంచి ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.200 కోట్లతో కంప్యూటర్లు, యూపీఎస్లు, ప్రింటర్లు, లామినేషన్ మిషన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్స్, ఫర్నీచర్, ఇంటర్నెట్ సమకూర్చారు.
తాత్కాలిక భవనాల్లోనూ...
వివిధ రకాల ధ్రువపత్రాల ముద్రణ కోసం అన్ని సచివాలయాలకు కలిపి 4 లక్షల నమూనా పత్రాలను పంపించారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ, వార్డు భవనాలను సచివాలయాలుగా కూడా ఉపయోగించుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తిగా కొత్తది. ఒక్కసారిగానే వీటికి భవనాలు నిర్మించడం సాధ్యం కాని పని. ఇందుకు అందుబాటులోని వనరులు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సచివాలయాలు కొత్తగా నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో, మరికొన్నింటిని ప్రభుత్వ భవనాల్లో, ఇంకొన్నింటిని తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేశారు.
కొన్నిచోట్ల ఇంటర్నెట్ అంతరాయం
ఉపాధిహామీ పథకంలో భాగంగా 3,189 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు ఇటీవల ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. సమాచార, సాంకేతిక వ్యవస్థకు దూరంగా ఉన్న వందలాది గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వలేని పరిస్థితి. కానీ కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు మాత్రం సరఫరా చేసి ఉంటారు. ఇంటర్నెట్ ఉన్న సమీప సచివాలయం నుంచి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల సేవలు కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది.
ఎన్ని సచివాలయాలు... ఎక్కడ
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,944 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో గ్రామాల్లో 11,158, పట్టణాల్లో 3,786 ఉన్నాయి. ఈ గ్రామ సచివాలయాల్లో మొత్తం 530 సేవలు అందుబాటులో ఉంటాయి. కేవలం సచివాలయాల్లో లభించే సేవలు మాత్రమే అయితే 386 ఉన్నాయి. మీ-సేవ కేంద్రాలతో పాటు లభించే సేవలు 144. భాగస్వామ్య ప్రభుత్వ శాఖలు 27.
72 గంటల్లో... అన్ని రకాల పత్రాలు
ప్రాధాన్యతా క్రమంలో 72 గంటల్లో సేవలు లభిస్తాయి. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల ధ్రవీకరణ పత్రాలు, పన్నులు, రుసుముల చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. వివిధ పనుల కోసం ప్రజలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ శాఖలను గ్రామ సచివాలయాల్లో భాగస్వాములుగా చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి అన్ని సేవలు పొందవచ్చు. జనన, మరణ, కుల ధ్రవీకరణ పత్రాలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పత్రాలు పొందవచ్చు. ఇక, గ్రామ వాలంటీర్ల సాయంతో పెన్షన్లు, రేషన్ సరుకులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కార్డులు, ఇళ్ల పట్టాలు, వైయస్సార్ పెళ్లి కానుక, వివిధ వర్గాలకు ప్రభుత్వం అందించే ఇతర ఆర్థిక సాయం కోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కొన్ని ఉచితం.. కొన్ని కనీస ఛార్జ్
ఇదివరకు అన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం ప్రజలు మీసేవ కేంద్రాలపై ఆధారపడేవారు. జనన, మరణ, కుల ధ్రవీకరణ పత్రాల కోసం, భూసంబంధిత పత్రాల కోసం మీ సేవలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేది. ప్రతి 5,000 జనాభాకు ఓ మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ప్రతి 2,000 మంది జనాభాకు ఓ సచివాలయం ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని సేవలు ఉచితంగా, మరికొన్నిసేవలు కనీస ఛార్జీతో అందిస్తారు.
భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 16వేలు
గ్రామ సచివాలయాలకు మొత్తం 1,26,728 మంది ఉద్యోగులు అవసరం. ఇప్పటి వరకు లక్షా పదివేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. మరో 16వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి.