బీ అలర్ట్:బిజినెస్మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి లక్షలు, ఎలాగంటే?
ఇటీవలి కాలంలో ఢిల్లీలోని కొంతమంది వ్యాపారుల అకౌంట్ల నుంచి డబ్బులు వివిధ రాష్ట్రాలలోని పేద ప్రజల అకౌంట్లలోకి వెళ్తున్నాయి! దీనిని చూసి మంచి విషయమే కదా అనుకునేరు. కానీ ఇదంతా సైబర్ నేరగాళ్ల పని. టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే సైబర్ నేరగాళ్ల టెక్నిక్స్ అంతకుమించి పెరుగుతున్నాయి. తాజాగా, ఢిల్లీలో వరుసగా షాకింగ్ సంఘటనలు వెలుగు చూశాయి. సైబర్ నేరగాళ్ల తీరు అందోళన కలిగిస్తోంది.
ఇది బంగారం కాదు.. అంతకంటే విలువైనది: ఈ ఏడాది రూ.1,42,127కు పెరిగింది
విచారణ తర్వాత విస్తుపోయిన పోలీసులు
ఇటీవల దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి తన అకౌంట్ నుంచి రూ.9 లక్షలు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు వీటిని దొంగిలించారు. స్థానిక పోలీసులు ఇది తమకు రొటీన్ కేసుగా భావించారు. కానీ విచారణలో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. జార్ఖండ్లోని జామ్తారా జిల్లాలో కార్మికుల పేర్లతో తెరిచిన నాలుగు జన్ ధన్ ఖాతాల్లోకి UPI లింక్ ద్వారా డబ్బులు జమ అయినట్లు దర్యాఫ్తులో తేలింది. డూప్లికేట్ థంప్ ఇంప్రెషన్స్ ద్వారా వీటిని ఉపసంహరించుకున్నట్లుగా పోలీసులు గుర్తించి ఆశ్చర్యపోయారు.
ఇలా జన్ ధన్ అకౌంట్ తెరిచి...
వ్యాపారి అకౌంట్స్ నుంచి లక్షల రూపాయలు మారుమూల ప్రాంతాల్లోన్ జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ కావడంతో పోలీసులు ఆ ఖాతాదారులను కలిశారు. అక్కడా వారికి విస్తుపోయే వాస్తవం తెలిసింది. వారిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారని పోలీసులు గుర్తించారు.
గుర్తు తెలియని వాళ్లు (సైబర్ నేరగాళ్లు) తాము బ్యాంకు అధికారులుగా పరిచయం చేసుకొని, ఆధార్, రేషన్, బీపీఎల్ కార్డు, థంబ్ ఇంప్రెషన్ వంటివి తీసుకున్నారు. మీకు జన్ ధన్ యోజన కింద అకౌంట్ తెరుస్తామని, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మారుమూల గ్రామస్తులకు నమ్మబలికారు. వారికి పాస్ బుక్స్ ఇచ్చారు.
నేరగాళ్ల బారిన ఢిల్లీ వ్యాపారులు
కేసు విచారణలో భాగంగా తాము వెరిఫికేషన్ చేయగా, అందులోని వివరాలు అన్నీ సరిగానే ఉన్నాయని, కానీ వారితో సైబర్ నేరగాళ్లు అకౌంట్స్ ఓపెన్ చేయించారని, కానీ బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్ డిఫరెంట్గా ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే మొదటి కేసు కాదని, ఢిల్లీకి చెందిన పలువురు వ్యాపారుల డబ్బులు ఇలాగే సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నాయని చెప్పారు. బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్ ద్వారా ఫ్రాడ్ జరుగుతోందన్నారు. ఈ డబ్బులు పేదల బ్యాంకు అకౌంట్లోకి వెళ్తున్నాయని, కానీ దానిని ఆన్ లైన్ నేరగాళ్లు కంట్రోల్ చేస్తున్నారని చెప్పారు.
దూర ప్రాంతాల్లోని బ్యాంకు అకౌంట్లలో అమౌంట్
మరో కేసులో దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి రూ.3.7 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు సుదూర ప్రాంతంలోని ఓ బ్యాంకు అకౌంట్లో పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటివి కొన్ని జరిగినట్లుగా చెబుతున్నారు.
ఫ్రాడ్ ఎలా జరుగుతోందంటే?
సైబర్ నేరగాళ్లు బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద, నిరక్షరాస్యులైన వారిని కలుస్తున్నారు. వివిధ ప్రభుత్వ ప్రయోజనాల పేరుతో జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఓ వైట్ పేపర్ మీద వారి వేలి ముద్రలు తీసుకుంటున్నారు. వాటిని డిజిటల్గా స్కాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. క్యాష్ విత్ డ్రాను తమ కంట్రోల్లో ఉండేలా చేయడం కోసం రబ్బర్ థంప్స్ను సృష్టిస్తున్నారు. ఇందుకు పాలీమర్ కెమికల్ స్టాంప్ తయారీ మెషిన్స్ ఉపయోగిస్తున్నారు. ఇమేజెస్ను క్లీన్ చేసేందుకు ఫోటోషాప్ కూడా ఉపయోగిస్తున్నారు.
మరో మార్గంలోనూ...
కొన్ని కేసుల్లో వివిధ గ్రామాలకు చెందిన అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్లకు తమ అకౌంట్ను ఇస్తున్నారు. అంటే మా డబ్బులు మీ అకౌంట్లో పడతాయని, వాటిని తీసుకుంటామని చెప్పి, అకౌంట్ హోల్డర్స్కు కొంత మొత్తం చెల్లిస్తున్నారు. ఇలా కూడా సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు.
నిమిషాల్లో అకౌంట్లోని డబ్బు మాయం
ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని వారిని మోసం చేసేందుకు ఉపయోగిస్తున్న సైబర్ క్రైమ్ అని, కొన్ని నిమిషాల్లోనే వారి అకౌంట్లోని డబ్బులు గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వ్యక్తుల అకౌంట్లలోకి వెళ్తోందని ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ సెల్ డీసీపీ చెబుతున్నారు.
అకౌంట్ ఓపెనింగ్ ఇప్పుడు ఈజీ కావడంతో..
దశాబ్ద కాలం క్రితం ఓ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం ఇద్దరు గ్యారెంటీగా ఉండాలని, కానీ ఇప్పుడు ఇది ఇంటి ముందుకే వస్తోందని సైబర్ అండ్ ఎకనమిక్ అఫెన్స్ ఎక్స్పర్ట్ జితెన్ జైన్ అన్నారు. ఇంటికి వచ్చి మరీ అవసరమైన డాక్యుమెంట్స్, సంతకాలు, థంప్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారని చెప్పారు. కానీ అలా వచ్చిన వారు ఎవరో, ఎందుకు వచ్చారో, ఆ డాక్యుమెంట్స్ ఎందుకో కూడా చాలామందికి తెలియని పరిస్థితి అంటున్నారు. సైబర్ నేరగాళ్లు వీటిని మిస్ యూజ్ చేస్తారన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో పాటు జార్ఖండ్లోని జంతారా, దుమ్కా వంటి జిల్లాల్లో పేదలు బ్యాంకు అకౌంట్ సెల్లింగ్ కామన్ అని మరో సైబర్ ఎక్స్పర్ట్ అనుజ్ అగర్వాల్ అన్నారు.
వరుస కేసులు...
ఆన్ లైన్ ఫ్రాడ్ కేసులో సెప్టెంబర్ నెలలో ఢిల్లీ పోలీసులు ఓ నైజీరియన్ను అరెస్టు చేశారు. అతను, అతని సహచరాలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులను బుక్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. వారు ఫేక్ అకౌంట్లోకి ట్రాన్సుఫర్ చేస్తారు.
అదే నెలలో ఎన్ఆర్ఐగా చెప్పుకొన్న మరో మహిళా చీటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఫేక్ బిజినెస్ డీల్లో ఆమె మనీని మిజోరాంలోని ఓ అకౌంటుకు లక్షల రూపాయలు ట్రాన్సుఫర్ చేయమని చెప్పింది.