గ్రామసచివాలయం: 15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,400 గ్రామ, వార్డు సచివాలయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 11,158, పట్టణాల్లో 3,786 అందుబాటులోకి వచ్చాయి. మండలానికి, పురపాలక సంఘానికి ఒకటి చొప్పున తొలి విడతగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో సచివాలయ ప్రారంభ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలు కీలకం. కాబట్టి వీటిల్లో ప్రజలకు అందించే సేవలు తెలుసుకుందాం.
ఏపీలో జగన్ ప్రభుత్వ పాలనపై మరిన్ని స్టోరీలు....
సచివాలయాల ద్వారా 3 విభాగాలుగా 500 రకాల సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. దరఖాస్తు చేసుకోగానే అక్కడికి అక్కడే అందించేవి, 72 గంటల్లోగా అందించే సేవలు, 72 గంటలు దాటిన తర్వాత అందించేవి. మొత్తం 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
15 నిమిషాల్లో అందించే సేవలు
వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవల్ని అప్పటికప్పుడు అంటే పావుగంటలో అందించేలా ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డు ప్రింట్, అడంగల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీ, విద్యుత్ కనెక్షన్ కేటగిరీ మార్పు దరఖాస్తు వంటి సేవలను 15 నిమిషాల్లో అందించవచ్చునని గుర్తించారు.
72 గంటల్లోపు.. ఆ తర్వాత
148 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అందించవచ్చునని గుర్తించారు. పింఛన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వంటి సేవలు దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, 72 గంటల కంటే ఎక్కువ సమయంలో 311 రకాల సేవల్ని అందించవచ్చునని గుర్తించారు.
ఏఏ శాఖల సేవలు...
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలు లేదా విభాగాలకు సంబంధించి వివిధ రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య, గృహ నిర్మాణ సంస్థ, పౌరసరఫరా, విద్యుత్, హోంశాఖ, కార్మిక, ఉపాధి, శిక్షణ, మున్సిపల్, పంచాయతీరాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సంక్షేమ శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి.
15 నిమిషాల్లో ఏ శాఖ నుంచి ఎన్ని సేవలు..
వెంటనే అంటే పావు గంట లేదా అటు ఇటుగా అయ్యే సేవలు వ్యవసాయం నుంచి 8, పశుసంవర్ధకం, డెయిరీ, మత్స్య శాఖ నుంచి 6, పౌర సరఫరాల నుంచి 1, హోంశాఖ నుంచి 6, మున్సిపల్ శాఖ నుంచి 8, పంచాయతీరాజ్ నుంచి 6, రెవెన్యూ నుంచి 2, సంక్షేమ శాఖ నుంచి 10 సేవలు వెంటనే పూర్తవుతాయి.
72 గంటల్లోపు ఏ శాఖ నుంచి ఎన్ని సేవలు..
72 గంటల్లోపు పూర్తయ్యే వాటిల్లో వ్యవసాయం నుంచి 26, పశుసంవర్ధకం, డెయిరీ, మత్స్య శాఖ నుంచి 1, గృహ నిర్మాణ సంస్థ నుంచి 1, పౌర సరఫరాల నుంచి 8, విద్యుత్ నుంచి 12, హోంశాఖ నుంచి 8, కార్మిక ఉపాధి శిక్షణ నుంచి 9, మున్సిపల్ శాఖ నుంచి 15, పంచాయతీరాజ్ నుంచి 6, స్టాంపులు రిజిస్ట్రేషన నుంచి 2, రెవెన్యూ నుంచి 16, సంక్షేమ శాఖ నుంచి 25 సేవలు ఉన్నాయి.
72 గంటల తర్వాత ఏ శాఖ నుంచి ఎన్ని సేవలు..
72 గంటల తర్వాత పూర్తయ్యే సేవల్లో... వ్యవసాయం నుంచి 26, పశు సంవర్ధకం, డెయిరీ, మత్స్య శాఖ నుంచి 5, పౌర సరఫరాల నుంచి 2, విద్యుత్ నుంచి 101, హోంశాఖ నుంచి 53, కార్మిక ఉపాధి శిక్షణ నుంచి 8, మున్సిపల్ శాఖ నుంచి 24, పంచాయతీరాజ్ నుంచి 19, రెవెన్యూ నుంచి 45, సంక్షేమ శాఖ నుంచి 27 సేవలు ఉన్నాయి.
2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తి సేవలు
గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే 500కు పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, దేశంలో ఒక్కడా లేని విధంగా అనతి కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని, 1,34,978 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల కల్పన రికార్డ్ అని జగన్ చెప్పారు. 2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తి సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తామన్నారు.
వచ్చే రెండు నెలల్లో అన్ని వసతులు...
జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డ్స్, పెన్షన్లు ఇలా అన్ని సేవలు 72 గంటల్లో అందిస్తామని జగన్ చెప్పారు. 35 ప్రభుత్వ శాఖల ద్వారా 500 రకాల సేవలు ప్రజలు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక్కో గ్రామ సచివాలయానికి 12 మంది చొప్పున ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిని నియమించామన్నారు. రానున్న రెండు నెలల్లో అన్ని సచివాలయాలకు కావాల్సిన వసతులు కల్పిస్తామని, పాలనాపరంగా ఎదురయ్యే సమస్యలను డిసెంబరులో పరిష్కరించి జనవరి 1 నుంచి పూర్తిస్థాయి సేవలు ప్రారంభిస్తామన్నారు. గ్రామ సచివాలయాల పక్కనే దుకాణాలు తెరిచి నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఇస్తామన్నారు.
లంచం కోసం డిమాండ్ చేస్తే 1902కు ఫోన్
అప్పటి నుంచి వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల్ని, సేవల్ని తలుపు తట్టి అందిస్తారన్నారు. ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే 1902 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా పని చేయాలని సూచించారు జగన్.
అమ్మఒడి, రైతు భరోసా నిధులు త్వరలో...
అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో జనవరి 26 నుంచి ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని జగన్ చెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి 1.72 లక్షల మంది ఆటో, కారు ఓనర్ల ఖాతాలో రూ.10 వేలు, 15న రైతు భరోసా కింద అన్నదాతలకు రూ.12,500 జమ చేస్తామని జగన్ చెప్పారు.