రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. సోమవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అంటే... సెప్టెంబర్ 10, మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది.
ఈ నెలాఖరునే వీరి అకౌంట్లోకి రూ.10,000!! జగన్ గుడ్న్యూస్
15 రోజుల్లో ఆ బ్యాంకు ఖాతా తెరవాలి
ఈ ప్రయోజనాన్ని పొందేందుకు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు ఖాతాను తెరిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలను గ్రామ వాలంటీర్ల నుంచి తీసుకోవచ్చును. ఈ బ్యాంకు ఖాతా రుణం కింద మినహాయించుకోవడానికి వీలులేని బ్యాంకు ఖాతా అయి ఉండాలి. దీనిని 15 రోజుల్లో తెరవాలి. మంగళవారం నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన డ్రైవర్లకు ఆ మొత్తాన్ని ఈ నెలాఖరు నాటికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తారు.
రూ.10,000కు వీరు అర్హులు...
డ్రైవర్లకు వాలిడిటీ కలిగిన లైసెన్స్ ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాహన పన్ను చెల్లింపులు అన్నీ పక్కాగా ఉండాలి. అలా ఉంటేనే అర్హులుగా పరిగణింపబడతారు. ఒక కుటుంబంలో ఎన్ని ఆటోలు లేదా ట్యాక్సీలు ఉన్నప్పటికీ ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. సొంతగా ఆటో, కారు, క్యాబ్ కలిగి ఉండి, యజమాని నడుపుతుండాలి. ప్రతి డ్రైవర్ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. గులాబీ రంగు కార్డు ఉన్న డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందదు.
ఆధార్ అనుసంధానం...
ప్రతి డ్రైవర్ కూడా తన లైసెన్స్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి. రవాణా శాఖ వెబ్ సైట్లో ఉండే వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో డ్రైవర్ తన ఆధార్ను అనుసంధానం చేయాలి. ఇలా అనుసంధానం చేయడానికి ఉప రవాణాశాఖ అధికారి, ప్రాంతీయ రవాణాశాఖ అధికారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. రవాణా శాఖ కార్యాలయాల్లోని సహాయక కేంద్రాల ద్వారా ఆధార్ అనుసంధానం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలను చెబుతారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును భర్తీ చేసేందుకు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాటు చేసిన కౌంటర్లను ఉపయోగించుకోవచ్చు. ఆయా కౌంటర్లలో పని చేసే సిబ్బంది ఆన్ లైన్ దరఖాస్తులను భర్తీ చేయడంలో డ్రైవర్లకు సహకరిస్తారు.
డేటా బేస్లో అప్ లోడ్
ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపిస్తారు అధికారులు. వీరు వాస్తవాలను పరిశీలించిన అనంతరం పట్టణాల్లో పురపాలక కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ నుంచి ఆమోదం తీసుకొని సీఎఫ్ఎంఎస్ డేటా బేస్లో అప్ లోడ్ చేస్తారు.
ఆ తర్వాత అర్హులుగా తేల్చుతారు
డ్రైవర్ల లైసెన్స్, ఆధార్ కార్డు వివరాలు రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ డేటాబేస్తో పోల్చి చూస్తారు. సరైనదిగా తేలితే అర్హులుగా గుర్తిస్తారు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ రవాణా శాఖ కమిషనర్ నిధులను విడుదల చేస్తారు. రూ.10,000 నగదును ప్రభుత్వం నేరుగా డ్రైవర్ల చేతికి అందించదు. బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసిన తర్వాత, ఈ నెలాఖరులోగా ఖజానా నుంచి అందులో జమ చేస్తుంది.
అందుకే ఈ ఆర్థిక సాయం..
సొంతగా ఆటో/ట్యాక్సీ/క్యాబ్ నడిపి, జీవనాన్ని కొనసాగిస్తున్న డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది డ్రైవర్లకు, రూ.400 కోట్ల మేర సాయం అందనుంది. వాహనాల బీమా, మరమ్మతులు తదితరాల కోసం ప్రభుత్వం డ్రైవర్లకు ఈ సాహాయాన్ని అందిస్తోంది.
రూ.10,000 పొందేందుకు అర్హతలు.. క్లుప్తంగా...
- ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతది అయి ఉండి, యజమానే నడపాలి.
- ఆటో/లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పన్నుల రసీదులు) అన్నీ సరిగ్గా ఉండాలి.
- అర్హుడు దారిద్య్రరేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాస్తు సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.