EPF గుడ్న్యూస్: మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్కు ఏదో ఒకటి
న్యూఢిల్లీ: కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల మేరకు ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం, సంస్థ నుంచి 12 శాతం ఎంప్లాయి పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. కొత్తగా రానున్న నిబంధనల ప్రకారం ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లోకి జమ అయ్యే మొత్తాన్ని తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే సంస్థకు మాత్రం లేదు. ఇదే కాకుండా ఈఫీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కనీస వేతన నిబంధనలతో పాటు ఉద్యోగి పింఛన్ (EPS)లో మార్పులు చేస్తుంది.
భారీ షాక్, హైదరాబాద్లో రూ.40,000 మార్క్ దాటిన బంగారం ధర
EPS లేదా NPS
ఈపీఎఫ్లో ఇప్పటి వరకు ఈపీఎస్ (ఉద్యోగి పెన్షన్ స్కీం) ఉంది. ఇందులో జాతీయ పింఛన్ స్కీం (NPS)ను కూడా చేర్చనుంది. అయితే ఉద్యోగి తన ఇష్టం మేరకు పింఛ్ పథకాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈపీఎఫ్ సవరణ బిల్లు 2019 డ్రాఫ్ట్ను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. ఈ బిల్లుపై వర్కర్స్ యూనియన్, పీఎఫ్ సబ్స్క్రైబర్స్, యాజమాన్యాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది. సెప్టెంబర్ 22వ తేదీలోగా అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారా లేదా ఢిల్లీ చిరునామాకు పంపించాలి. వచ్చే ఏడాది నుంచి ఇవి అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఎన్పీఎస్పై వ్యతిరేకత..
EPSతో పాటు NPSను చేర్చాలని చాలా రోజులుగా యోచిస్తున్నారు. గతంలో ఈపీఎస్కు బదులు ఎన్పీఎస్ ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్పీఎస్ను ఐచ్ఛికంగా మాత్రమే చేర్చింది. ఈపీఎస్ కింద వేతనజీవులకు రిటైర్మెంట్ తర్వాత కచ్చిత పింఛన్ వస్తుంది. భవిష్యనిధి చందా మొత్తాన్ని ఒకేసారి పన్ను లేకుండా తీసుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఈపీఎస్లో ఉంది. ఉద్యోగులు రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. నిబంధనల మేరకు ఎన్పీఎస్ నుంచి ఈపీఎస్కు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
టేక్ హోమ్ శాలరీ పెంచుకునే వెసులుబాటు...
EPF చట్టం ప్రకారం బేసిక్ శాలరీ, డీఏ, ఇతర భత్యం కలిపి శాలరీగా నిర్ణయించి ఉద్యోగి వాటా కింద పన్నెండు శాతం, కంపెనీ వాటా కింద 12 శాతాన్ని ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తారు. తాజా బిల్లు ప్రకారం తక్కువ వేతనం కలిగిన ఉద్యోగుల వయస్సు ఆధారంగా చందాను తగ్గించుకునే అవకాశాన్ని కల్పించనుందట. యజమాని వాటా మాత్రం తగ్గదు. ఇది వేతనజీవులకు పెద్ద ఊరట. వారి వారి అవసరాల ఆధారంగా టేక్ హోమ్ శాలరీని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈపీఎస్లో ఇలా...
ఈపీఎస్లో ఉద్యోగి, యజమాని నుంచి పెన్షన్ నిబంధన ఆధారంగా ప్రతి నెల బ్యాంకులో జమ అవుతుంది. ఈ పెన్షన్ కోసం యజమాని వాటాలోని 12 శాతంలో 8.3 శాతం వాటాను గరిష్టంగా రూ.1250ని ఈపీఎస్లో జమ చేస్తారు.
ఎన్పీఎస్లో...
ఉద్యోగి ఎన్పీఎస్ పథకం ఎంచుకుంటే ఇది పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకి వెళ్తుంది. ఉద్యోగం మానేసి మొత్తాన్ని తీసుకునేందుకు ఎన్పీఎస్ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చాక అరవై శాతం మాత్రమే తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను ఉంటుంది. మిగతా 40 శాతం యాన్యుటీ స్కీంలో ఇన్వెస్ట్ చేసి, సంబంధిత బీమా సంస్థ నిర్ణయించిన వడ్డీ ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందవచ్చు.
డొమెస్టిక్ హెల్ప్, డ్రైవర్స్కు ఈపీఎఫ్ బెనిఫిట్స్
నరేంద్ర మోడీ ప్రభుత్వం డొమెస్టిక్ హెల్ప్, డ్రైవర్ వంటి ఇతర స్వయం ఉపాధి వంటి వారికి కూడా ఈఫీఎఫ్ బెనిఫిట్స్ కల్పించనుంది. ఈ మేరకు లేబర్ మినిస్ట్రీ తయారు చేసిన ఈపీఎఫ్ సవరణల్లో దీనిని కూడా పొందుపర్చారు. ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పెన్షన్ స్కీంను తీసుకు వచ్చారు. దీనికి కొనసాగింపుగా ఈఫీఎఫ్లో చేర్చవచ్చు. దాదాపు అన్ని తరగతుల ఉద్యోగులకు ఈపీఎఫ్ బెనిఫిట్స్ అందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సవరణలు చేస్తోంది.
12 శాతం నుంచి మినహాయింపు...
ఈపీఎఫ్లో 12 శాతం వాటా ఉద్యోగులది, 12 శాతం వాటా కంపెనీలది ఉంటుంది. అయితే డొమెస్టిక్ హెల్ప్, డ్రైవర్స్ వంటి వారిని ఈపీఎఫ్లో చేర్చడం కోసం ఉద్యోగుల తరగతిని బట్టి 12 శాతం తగ్గించడం, చిన్న చిన్న షాప్స్ కాబట్టి యజమానులకు వాటా నుంచి మినహాయింపు ఇవ్వడం వంటివి ఉండవచ్చునని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రేట్లు నిర్ణయించే అధికారం
కేంద్ర కార్మిక శాఖ తీసుకు వచ్చే ఈ కొత్త సవరణలు డ్రైవర్లు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మెయిడ్స్, పని మనుషులు వంటి వారికి తరగతుల వారీగా రేట్లు నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుందట. ఈపీఎఫ్కు యజమాని సహకారం వారికే వదిలేయనుందట. ప్రస్తుతం కార్మిక శాఖ తీసుకు వచ్చే సవరణలు ఏ తరగతి ఉద్యోగులకైనా వర్తించేలా ఉంటుందని తెలుస్తోంది.