సూపర్ ఆఫర్: 59 ని.ల్లో హోమ్లోన్, వెహికిల్ లోన్! బ్యాంక్ మీ ఇష్టం..
న్యూఢిల్లీ: హోంలోన్ లేదా వెహికిల్ లోన్ కోసం రోజుల కొద్ది ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. లోన్ మంజూరు ప్రక్రియని వేగవంతం చేయనున్నారు. కేవలం 59 నిమిషాల్లోనే లోన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు.. తక్కువ సమయంలోనే లోన్ ఇచ్చే ఓ పోర్టల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (PSB)లు రిటైల్ రుణాలను కూడా భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. psbloansin59minutes ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పించనుంది. దీని ద్వారా హోమ్ లోన్, వాహన లోన్ ప్రక్రియ త్వరగా పూర్తి కానుంది.
LPG డిస్ట్రిబ్యూటర్షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ
59 నిమిషాల్లో లోన్ అప్రూవల్
ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSMEs)లకు 59 నిమిషాల్లో లేదా ఒక గంటలోపు రూ.1 కోటి వరకు రుణాలకు సూత్రప్రాయంగా అప్రూవ్ చేస్తోంది. అదే సమయంలో ఈ పోర్టల్ ద్వారా రూ.5 కోట్ల వరకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పోరేషన్ బ్యాంకులు నిర్ణయించాయి.
హోమ్, వెహికిల్ లోన్స్నూ భాగస్వామ్యం
psbloansin59minutes పోర్టల్లో హోమ్, వెహికిల్ లోన్స్తో పాటు ఇతర రుణాలను కూడా భాగస్వామ్యం చేసేందుకు PSB బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. కొన్ని రిటైల్ రుణాలను పోర్టల్ ద్వారా సులభంగా మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి.
నచ్చిన బ్యాంకును ఎంచుకునే సౌకర్యం
పోర్టల్లో సూత్రప్రాయ ఆమోదం లభించిన తర్వాత తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకునే సౌలభ్యం లోన్ తీసుకునే వారికి ఉంది. రుణ ఆమోద లేఖ అందిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వర్కింగ్ డేస్లలో రుణ మొతాన్ని మంజూరు చేస్తున్నారు. అలాగే, రుణగ్రహీతకు సమయాన్ని కూడా ఆదా చేస్తోంది.
పోర్టల్కు సానుకూల స్పందన
హోమ్, ఆటో లోన్లను కూడా దీని పరిధిలోకి తీసుకు వచ్చేందుకు బ్యాంకు వర్క్ చేస్తోందని బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ వెల్లడించారు. రుణగ్రహీతల నుంచి ఈ పోర్టల్కు సానుకూల స్పందన వస్తోందని, ఈ నేపథ్యంలో MSMEలకు రూ.5 కోట్ల వరకు దీని పరిధిలోకి తీసుకు వస్తామని, అలాగే రిటైల్ ప్రాడక్ట్స్ (హోమ్, పర్సనల్ లోన్) కూడా ఈ ప్లాట్ ఫాంలోకి తీసుకు వచ్చేందుకు వర్కవుట్ చేస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తెలిపింది.
సమయం ఆదా, తగ్గుతున్న ట్రాన్సాక్షన్ కాస్ట్
ఈ ప్రక్రియ ద్వారా రుణ మంజూరును వేగవంతం చేయడంతో పాటు బ్యాంకర్లు, కస్టమర్ల సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడిందని మరో బ్యాంకు సీనియర్ అధికారి వెల్లడించారు. ఇతర రుణాలను కూడా ఇందులోకి ప్రవేశపెడితే బ్యాంకుల రిటైల్ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని, అలాగే ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందన్నారు.
మోడీ ప్రారంభించిన నాలుగు నెలల్లోనే..
దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫాంను 2018 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. MSMEలకు క్రెడిట్ యాక్సెస్, పారదర్శక బ్యాంకింగ్, కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా దీనిని తీసుకు వచ్చారు. ఈ పోర్టల్ ప్రారంభించిన నాలుగు నెలల్లో రూ.35,000 కోట్ల విలువైన రుణాలు మంజూరు అయ్యాయి. మార్చి 31, 2019 నాటికి 50,706 కోట్ల ప్రపొజల్స్ వచ్చాయి. ఇందులో 27,893 ప్రపోజల్స్కు రుణాలు మంజూరు అయ్యాయి.