జూలై1 నుంచి మార్పులు: ఏవి భారం కానున్నాయి, ఏ ఛార్జీలు తగ్గుతాయి.. వివరాలివీ..
న్యూఢిల్లీ: ఈ రోజు జూలై 1... ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ నుంచి రైల్వే టైమ్ టేబుల్ వరకు పలు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు నుంచి పలు వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే, RTGS, NEFT సేవలపై ఆర్బీఐ ఛార్జీలు రద్దు చేసింది. ఎస్బీఐ రెపో రేటు లింక్ చేసి హోమ్ లోన్ ఆఫర్ చేసేది ఈ రోజు నుంచే. ఇవే కాకుండా మరెన్నో మేజర్ ఈవెంట్స్ ఈ రోజు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం....
పీఎం-కిసాన్ సాయం రూ.8,000కు పెంచే ఛాన్స్
సంస్కరణలు.. వాటిని జీఎస్టీలోకి తేవాలని సూచన
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తీసుకువచ్చి నేటితో రెండేళ్లు పూర్తయింది. ఈ యానివర్సరీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు వివిధ విభాగాల్లోని కీలక కార్యదర్శులు పాల్గొంటారు. కొత్ట రిటర్న్ల విధానం నేటి నుంచి ప్రయోగాత్మక పద్ధతిలో ప్రారంభమవుతుందని, అక్టోబర్ 1 నుంచి దీనిని తప్పనిసరి చేస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది. తక్కువ మొత్తంలో పన్నులు చెల్లించే వారికి సహజ్, సుగమ్ రిటర్న్స్ను ప్రతిపాదించినట్లు పేర్కొంది. నగదు లెడ్జర్ను సరళీకరిస్తామని, పన్నులు, వడ్డీ, జరిమానా, ఛార్జీలకు సంబంధించి ఒకే నగదు లెడ్జర్ ఉంటుందని తెలిపింది. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, సెస్లకు సంబంధించి వేరువేరుగా రిఫండ్ల మంజూరు కాకుండా రీఫండ్ పంపిణీలకు సంబంధించి ఏక విధానాన్ని తెస్తామంది. జీఎస్టీ రెండో దశను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని పరిస్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, స్థిరాస్తి, అల్కాహాల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని సూచించాయి.
దక్షిణ మధ్య రైల్వేలో 40 రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు
రైళ్ల పొడిగింపు, వేగం పెంపు, కొత్త స్టాప్ వంటి కీలక ప్రతిపాదనలు ఆచరణకు నోచుకుంటే కొత్త టైమ్ టేబుల్ ద్వారా అవి అధికారికంగా అమలులోకి వస్తాయి. ఇందుకు ప్రయాణికులు ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఇంత కీలకమైన రైల్వే టైమ్ టేబుల్ వేటి నుంచి అమలులోకి వస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ఆదివారం కొత్త టైమ్ టేబుల్ను ప్రకటించింది. ఇది ఈ రోజు (జూలై 1) నుంచి అమలులోకి వస్తోంది.
దక్షిణ మధ్య రైల్వేలోని నలభై రైళ్ల టైం టేబుల్లో మార్పులిలా ఉన్నాయి. రైల్ నెంబర్ 17202 సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో మధ్యాహ్నం గం.1లవ బదులు అరగంట ముందు.. 12.30 గంటలకే బయలుదేరుతుంది. విజయవాడకు రాత్రి గం.7.45కు చేరుకొని, అక్కడి నుంచి గం.7.55 తిరిగి బయలుదేరుతుంది. రైల్ నెంబర్ 12748 వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ వికారాబాద్లో మధ్యాహ్నం గం.2.40కు బయలుదేరి రాత్రి గం.9కి గుంటూరుకు చేరుకుంటుంది. రైల్ నెంబర్ 12806 లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్కు ఉదయం గం.7 చేరుకుని 7.05కు బయలుదేరుతుంది. రైల్ నెంబరు 12714 సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో గం.4.25కు బయలుదేరుతుంది.
రైల్ నెంబర్ 17027 సికింద్రాబాద్-కర్నూలు హంద్రీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో సాయంత్రం గం.6.45కు, రైల్ నెంబరు 12513 సికింద్రాబాద్-గౌహతి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో ఉదయం గం.7.20కు, రైల్ నెంబరు 17211 మచిలీపట్నం-యశ్వంత్పూర్ కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నంలో మధ్యాహ్నం గం.3.35కు, రైల్ నెంబర్ 12709 బెంగళూరు-కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ విజయవాడకు రాత్రి గం.12.35కు చేరుకుంటుంది.
రైల్ నెంబర్ 17256 హైదరాబాద్ - నర్సాపూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో రాత్రి గం.9.30కు బయలుదేరుతుంది. రైల్ నెంబర్ 16032 శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా-చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్ రాత్రి గం.10.55కు విజయవాడకు చేరుకుంటుంది. రైల్ నెంబర్ 22705 తిరుపతి-జమ్మూతావి ఎక్స్ప్రెస్ తిరుపతిలో సాయంత్రం గం.5.55కు, నెంబరు 77201 విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్ విజయవాడలో రాత్రి గం.1.35కు, రైలు రైల్ నెంబరు 67232 గుంటూరు-తిరుపతి ప్యాసింజర్ గుంటూరులో అర్ధరాత్రి గం.12.30కు బయలుదేరుతుంది. రైల్ నెంబర్ 66055/66056 నెల్లూరు-మూర్మార్కెట్ కాంప్లెక్స్ (చెన్నై)-నెల్లూరు మెము సర్వీసు ఇకపై నెంబరు 17237/17238గా మార్పు చేశారు.
RTGS, NEFTపై ఛార్జీలు రద్దు చేసిన ఆర్బీఐ
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా ఆర్బీఐ.. ఈ రోజు నుంచి నగదును పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే RTGS(రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్), NEFT(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్) ఛార్జీలను రద్దు చేసింది. ఆర్టీజీస్లో అయితే ఎక్కువ మొత్తంలో, నెఫ్ట్ విధానంలో రూ.2 లక్షల వరకు నగదును బదలీ చేసుకోవచ్చు. దీనిపై ఆర్బీఐ ఛార్జీలు రద్దు చేసింది. దీంతో ఇవి మరింత చవక కానున్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో నెఫ్ట్, ఆర్టీజీఎస్ పై ఛార్జీలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంకు శనివారం ప్రకటించింది.
ఏఎస్ఎఫ్ ఛార్జీలు
ఎయిర్ ట్రావెల్ ఇక నుంచి కాస్త ఖరీదు కానున్నాయి. ఎందుకంటే కేంద్ర విమానయాన శాఖ.. ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు (ASF) ఛార్జీను రూ.130 నుంచి రూ.150కి పెంచనున్నట్లు ప్రకటించింది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తోంది. ఇంటర్నేషనల్ ప్రయాణీకులకు 3.25 డాలర్ల నుంచి 4.85 డాలర్లకు పెంచింది. డొమెస్టిక్ ప్యాసెంజర్లకు అయితే రూ.150 వసూలు చేయనుంది. ఈ ప్రకటన జూన్ 7వ తేదీన చేసింది. ఈ రోజు అమలులోకి వస్తోంది.
రెపో రేటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత నెలలో రెపో రేటును పావు శాతం తగ్గించడంతో 5.75గా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్లో మూడుసార్లు తగ్గించడంతో 6.50 శాతం నుంచి 5.75 శాతానికి వచ్చింది. రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తోంది. నేటి నుంచి హోమ్ లోన్స్ సహా పలు సేవలకు రెపో రేటును లింక్ చేస్తోంది.
FSSAI
ఫుడ్ బిజినెస్ చేసేవారు కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు పాటించాలి. ఆహార పదార్థాల కోసం రీసైకిల్డ్ ప్లాస్టిక్, న్యూస్ పేపర్ వాడకాన్ని నిరోధించాలని FSSAI ఆదేశాలు జారీ చేసింది. ఇది నేటి నుంచి అమలులోకి వస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ప్లాస్టిక్తో తయారు చేసిన ప్యాకేజింగ్ సామాగ్రిని నిషేధించారు. ఇందులో ప్యాకేజీంగ్, నిల్వ చేయడం, తీసుకు వెళ్లడం లేదా పంపిణీ చేయడం వంటివి నిషేధం.
M&M ధర పెరుగుదల
M&M (మహీంద్రా అండ్ మహీంద్రా) పర్సనల్ వెహికిల్స్ ధరలు రూ.36వేల వరకు పెరగనున్నాయి. ఇది ఈ రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఈ పెంపుకు కారణం AIS 145 సేఫ్టీ నిబంధనల అమలు చేయడమే కారణమని చెబుతున్నారు. దీంతో Scorpio, Bolero, TUV300, KUV100 NXT ధరల్లో ఎక్కువ పెరుగుదల, XUV500, Marazzo ధరల్లో తక్కువ పెరుగుదల ఉండనుంది.
స్పైస్ జెట్
స్పైస్ జెట్ గౌహతి - ఢాకా - గౌహతి రూట్లో ఈ రోజు నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. UDAN ఇంటర్నేషనల్ స్కీం కింద బంగ్లాదేశ్కు సేవలు ప్రారంభించిన తొలి విమానం ఇదే. ఇండియన్ స్టేట్స్, ఎంచుకున్న అంతర్జాతీయ మార్గాల్లో ప్రభుత్వ రాయితీతో ఎయిర్ కనెక్టివిటీ పెంచుతున్నారు.