సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయట్లేదా?: మీరు ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే
న్యూఢిల్లీ: మీరు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్నారా? పెనాల్టీ కడితే సరిపోతుందని భావిస్తున్నారా? అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఇది కేవలం పెనాల్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఐటీ రిటర్న్స్ను నిర్ణీత సమయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే మరికొన్ని ప్రయోజనాలకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయవచ్చు కానీ పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు, కొన్ని ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.
ఏప్రిల్ 1 తేదీలోగా ఇవి మరిచిపోకండి!
నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ దాఖలు చేయాలి
ఇన్కం ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆదాయపన్ను చెల్లించే క్రమంలో కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉన్నాయి. రెంటల్ అగ్రిమెంట్, పిల్లల స్కూల్ ఫీజులు, బీమా తదితర ఖర్చు ద్వారాకొంత మనీ సేవ్ చేసుకోవచ్చు. నిర్ణీత ఆదాయం కంటే ఎక్కువ పొందుతున్న వారు తప్పనిసరిగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 234 ప్రకారం పన్ను చెల్లించకుంటే జరిమానా చెల్లించాలి. సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఆలస్యమైతే పెనాల్టీతో పాటు ఈ క్రింది ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది.
రూ.10 వేలు పెనాల్టీ
కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైగా ఇన్కం ఉన్నవారు మార్చి 31, 2019 తేదీలోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన 1 ఏప్రిల్ 2018 నుంచి అమలులోకి వచ్చింది. అలా చెల్లించని పక్షంలో ఇండివిడ్యుయల్స్కు రూ.10,000 పెనాల్టీ విధిస్తారు. సెక్షన్ 234 ప్రకారం.. పన్ను చెల్లించకుంటే జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలవారు రూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
రిటర్న్స్ రివిజన్ ఏడాది వరకే
దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్లో ఏమైనా పొరపాట్లు, లోపాలు ఉంటే రివిజన్ కోసం ఏడాదిలోపు మాత్రమే అనుమతిస్తారు. గతంలో రెండు సంవత్సరాల కాలం ఉంది. ఇప్పుడు ఏడాది లోపు సరిదిద్దుకోవాలి.
ఐటీ రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయకుంటే ఇలా నష్టం
పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుత ఏడాది వచ్చే నష్టాలను వచ్చే ఎనిమిదేళ్ల వరకు మూలధన ఆర్జనలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఐటీ చట్టం ప్రకారం గడువులోగా రిటర్నులు దాఖలు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ మీరు గడువు దాటాక రిటర్నులు దాఖలు చేస్తే ఈ ఏడాది నష్టాలను భవిష్యత్కు క్యారీ ఫార్వర్డ్ (ముందుకు తీసుకెళ్లడం) చేయలేరు. అయితే, ఇక్కడ మరో విషయం ఉంది. అన్ని నష్టాలకు ఇది వర్తించదు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోయినప్పటికీ హౌసింగ్ ప్రాపర్టీ వంటి నష్టాలు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.
ఐటి రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు
ఇప్పటికే మీరు అధిక పన్ను చెల్లించి ఉంటే కనుక రిటర్నుల దాఖలు ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీరు రిటర్న్ దాఖలు ఆలస్యం చేస్తే మాత్రం రీఫండ్ చెల్లింపు కూడా జాప్యం అవుతుంది. సాధారణంగా రీఫండ్ చెల్లింపులో జాప్యమైన పక్షంలో ఐటీ శాఖ మొత్తం సొమ్ముపై వడ్డీ కూడా చెల్లిస్తుంది. కానీ సకాలంలో రిటర్న్లు దాఖలు చేయకుంటే ఆలస్యమైన సమయానికి వడ్డీని చెల్లించదు. రిటర్న్స్ దాఖలు గడువు ముగిశాక చెల్లించాల్సిన పన్ను మొత్తంపై నెలకు ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు రిటర్న్స్ దాఖలు చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఉద్దేశపూర్వకంగానే మీరు రిటర్నులు దాఖలు చేయలేదని తేలితే భారీ పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.