జీఎస్టీలో చిన్న యూనిట్లకు పెద్ద ఊరట
సాధారణంగా చిన్న, మధ్య తరహా యూనిట్లకు పరోక్ష పన్నులకు సంబంధించి ట్యాక్స్ ట్రీట్మెంట్ తగు రీతిగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే సగటు యూనిట్ ఉత్పత్తికి తక్కువ మూలధనం ఉపయోగించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. అయితే గతంలో వీటికి తక్కువ ఎక్సైజ్ డ్యూటీలు వేసే వెసులుబాటు ఇవ్వడం ద్వారా ఆ రంగం ఎదిగిందా లేదా అని తెలుసుకునేందుకు సరైన ఆధారాలేమీ లేకపోవచ్చు.
రూ. 20 లక్షల లోపు వాటికి జీఎస్టీ లేనట్లే
ఈ చర్చ అంతా ఇప్పుడు ఎందుకంటే జీఎస్టీ వస్తోంది కాబట్టి. ప్రస్తుతం జీఎస్టీ అమలు జరిపేటప్పుడు చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితిపై చర్చ జరుగుతోంది. ఆయా పరిశ్రమలకు తక్కువ డ్యూటీలు వేసేలా జీఎస్టీ చట్టం ఉండబోతోంది. టర్నోవర్ రూ.20 లక్షల వరకూ ఉండే పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే. రూ. 20 లక్షలకు పైబడి టర్నోవర్ ఉంటే, ఆ తర్వాత మరో రూ. 30 లక్షల వరకూ జీఎస్టీని 1-2 శాతానికి పరిమితం చేయాలని సమాలోచనలు జరుగుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ఆర్థిక ఖాతాలను వెల్లడించిన తర్వాత సెల్ఫ్ సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
అన్నీ నియంత్రణ పరిధిలోకి
చాలా చిన్న యూనిట్లు సైతం డ్యూటీ మినహాయింపులు, రాయితీలు పొందే వీలు ఉన్నప్పటికీ జీఎస్టీ వచ్చిన తర్వాత చాలా వరకూ నియంత్రణ సంస్థల పరిధిలోకి తెచ్చి ఎగవేతలు లేకుండా చూస్తారు. జీఎస్టీలో సమర్థవంతమైన సాంకేతికత వాడకం కారణంగా ఇది జరగనుంది. ఏ యూనిట్ అయినా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ తర్వాత జీఎస్టీఎన్ నంబరును పొందాల్సి ఉంటుంది. చిన్న తరహా యూనిట్ల టర్నోవర్ రూ. 20 నుంచి రూ.50 లక్షల మధ్య ఉంటే, జీఎస్టీ నంబరు ఉండాలి. మినహాయింపులు ఇవ్వడం ద్వారా చిన్న తరహా యూనిట్లలో ఆశించిన పురోగతి జరగలేదనే వాదనా ఉంది. మరో వైపు పన్ను మినహాయింపుల కోసం ఆదాయాలను తక్కువ చేసి చూపించినట్లు ప్రచారం జరుగుతోంది.
సమూల మార్పు
చిన్న ముడి పదార్థం మొదలుకొని వస్తువు వినియోగదారుడి దగ్గరికి వచ్చే వరకూ అన్నీ జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. అంటే ఉదాహరణకు ఒక చొక్కా మార్కెట్లోకి తయారయి దుకాణం వరకూ వెళ్లాలంటే రెండు మూడు దశలు దాటి వెళ్తుంది. పత్తి దారంగా మారే దశ నుంచి, మనం చొక్కా కొనుక్కునే వరకూ ప్రతి దశలోనూ అకౌంటబిలిటీ ఉండబోతుంది అన్నమాట. జీఎస్టీపైన జరిగిన రాజ్యాంగ సవరణ కేంద్రానికి పన్ను వ్యాపారంపైన, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను సేవలపైన అధికారాలనిస్తుంది. ద్వంద్వ వ్యాట్ విధానాన్ని జీఎస్టీ అరికట్టనుంది. జీఎస్టీ వచ్చిన తర్వాత లావాదేవీల విలువను తక్కువ చేసి చూపడం కుదరదు. పన్నుకు సంబంధించి వాల్యూ చైన్ను మొత్తం ఇంటిగ్రేట్ చేస్తారు. ఇన్పుట్ క్రెడిట్, ఇన్పుట్ సర్వీసెస్, దిగుమతి చేసుకున్న క్యాపిటల్ గూడ్స్ అన్నీ లెక్కల్లో కనిపించాలి. ప్రస్తుతం చాలా యూనిట్లు సెంట్రల్ డ్యూటీలు కడుతున్నాయి. రాష్ట్రంలో వ్యాట్ చెల్లిస్తున్న వ్యాపారులు డ్యూటీల మినహాయింపులను వాడుకోలేకపోతున్నారు.
అన్నీ జీఎస్టీ పరిధిలోకి రావాల్సిందే
ప్రస్తుతం కొన్ని పరిశ్రమలు అవ్యవస్థీకృత రంగంలో ఉంటున్నాయి. అలా ఉండటమే కాకుండా బిజినెస్ టర్నోవర్ ఎక్కువ ఉన్నా డ్యూటీ మినహాయింపుల కోసం చిన్న తరహా యూనిట్లగా పరిగణింపబడుతున్నాయి. దీనికి సరైన వ్యవస్థ లేకపోవడమే కారణం. డైరెక్ట్ ట్యాక్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ శాఖల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంతో చిన్న యూనిట్లు అసలు ఆదాయం బాగా ఉంటే అధిక ఆదాయాలను డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చూపించాల్సి వస్తుంది. అందులోనూ బిజినెస్లో ప్రతిచోటా ప్యాన్ రిజిస్ట్రేషన్ నంబరు నమోదు చేస్తారు కాబట్టి ట్రాకింగ్ సులువుగా ఉంటుంది.
వస్తువులు, సేవా రంగాలు
వస్తువుల రంగం, సేవా రంగాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో స్పష్టమైన విభజన ఉండాల్సి ఏర్పడుతుంది. మినహాయంపులకు సంబంధించి సేవల రంగంలో టర్నోవర్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వస్తువుల(గూడ్స్) రంగంలో ఈ టర్నోవర్ పరిమితిని రూ. 1.50 కోటిగా నిర్ణయిస్తుండగా; సేవా రంగంలో దీన్ని రూ. 10 లక్షలుగా ఉంచారు. దీని వల్ల సేవా రంగంలో చిన్న యూనిట్లకు వస్తు రంగంతో పోలిస్తే మినహాయింపులు తక్కువగా లభిస్తున్నట్లే. దీనిపై జీఎస్టీలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.
రెండు పర్యవేక్షణలు తప్పుతాయా?
ప్రస్తుతం చిన్న, మధ్య తరహా యూనిట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ జవాబుదారీగా ఉంటూ వస్తున్నాయి. జీఎస్టీలో ద్వంద్వ పర్యవేక్షణ ఉండదని స్పష్టంగా ఉంది. జీఎస్టీఎన్లో ప్రతి లావాదేవీని ఆన్లైన్లో పర్యవేక్షించే వ్యవస్థ ఉంటుంది. దీంతో ఎవరికి వారే ఎప్పటికప్పుడు పన్నులు కట్టాల్సి వస్తుంది. ఎక్కువ యూనిట్లు పన్ను పరిధిలోకి రావడం మూలంగా కింది స్థాయి వాటికి ప్రభుత్వం తగురీతిలో పలు మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు సైతం పెరుగుతుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(వ్యాపార స్వేచ్చ)
పన్ను మినహాయింపులు ఇవ్వడం మూలంగా వచ్చిన వాస్తవ ఫలితం పెద్దగా లేదని ఇటీవలి ఐఎంఎఫ్; ప్రపంచ బ్యాంకు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం చేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తే చిన్న, మధ్య తరహా యూనిట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని అవి వెల్లడించాయి. అంటే కార్మిక చట్టాల్లో సరళత, నియంత్రణ వ్యవస్థల్లో స్పష్టత, బ్యాంకు అప్పులు తీసుకునేందుకు సులభ విదానాలు వంటివి ఉండాలి. పన్ను రాయితీలు, మినహాయింపులకు పెట్టే ఖర్చులను మౌలిక సదుపాయాలు అభివృద్ది పరిచేందుకు ఉపయోగిస్తే ఆయా యూనిట్లు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. మొత్తం జీఎస్టీ వల్ల జరిగే మార్పులన్నీ చిన్న, మధ్య తరహా యూనిట్లు వ్యాపార పరంగా పుంజుకునేందుకు ఉపయోగపడతాయని ఆశిద్దాం.