సుకన్య సమృద్ది- మారిన నియమాలు
గతేడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో సుకన్య సమృద్ది ఒకటి. దీన్ని మైనర్ బాలిక పేరుతో తెరవచ్చు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం అమ్మాయిల పేరిట పొదుపు చేయడం. దానిని వారి ఉన్నత విద్య, వివాహాల కోసం ఉపయోగించడం. జనవరి 2015లో ప్రారంభించిన ఈ పథకానికి చాలా తక్కువ కాలంలోనే మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి 76 లక్షల ఖాతాలను తెరవగా దాదాపు ఆయా అకౌంట్ల ద్వారా రూ. 2838 కోట్లు పోగయ్యింది. ఈ పథకం చాలా సులువుగా ఉండటమే కాకుండా మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది.
1. పౌరసత్వంలో మార్పు
కేవలం భారత పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే ఇందులో లబ్దిదారులుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఖాతాదారు భారత పౌరసత్వం కోల్పోయి ఎన్ఆర్ఐ అయితే ఖాతా మూసివేసినట్లుగా పరిగణిస్తారు. పౌరసత్వం మారిన తర్వాత వడ్డీ జమ అవదు.
2. ఖాతా బదిలీ
పోస్టాఫీసు, బ్యాంకు శాఖల్లో తెరిచిన సుకన్య సమృద్ది ఖాతాను ఒకచోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసుకోవచ్చు. ఇల్లు మారుతున్నట్లుగా ఆధారాలు చూపితే ఎటువంటి రుసుము లేకుండా ఖాతాను బదిలీ చేస్తారు. అలా కాకుండా పోస్టాఫీసుకు కానీ లేదా బ్యాంకుకు రూ. 100 చెల్లించి వేరే చోటకు ఖాతాను మార్చుకోవచ్చు.
3. గరిష్ట సొమ్ము
ఒక ఆర్థిక సంవత్సరంలో అమ్మాయి పేరిట జమ చేసే సొమ్ము రూ. 1లక్షా 50 వేలకు మించకూడదు. పరిమితికి మించిన డబ్బుకు వడ్డీ రాదు. వార్షిక పరిమితికి మించి జమ చేసిన సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా డిపాజిట్దారు వెనక్కు తీసుకోవచ్చు.
4. వడ్డీ రేటు
ఏడాదికొకసారి చక్రవడ్డీ రూపంలో లెక్కింపు జరుగుతుంది. సమయానుకూలంగా ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను మారుస్తోంది. ఏప్రిల్ 1,2016 న ప్రకటించిన దాని ప్రకారం వడ్డీ రేటు 8.6 శాతం ఉంది.
5. డిపాజిట్ వయసు
ఇంతకు ముందు అమ్మాయి గరిష్ట వయసు 14 ఏళ్ల దాకా డిపాజిట్లు చేసే వీలుంది. ప్రస్తుతం దాన్ని 15కు మార్చారు.
6. కనీస డిపాజిట్
ఇంతకుముందు వడ్డీ రావాలంటే కనీసం ఏడాదికి రూ. 1000 డిపాజిట్ చేయాలని నియమం ఉంది. ప్రస్తతం కనీస డిపాజిట్ చేయకున్నా ఉన్న సొమ్ముకు 4 శాతం వడ్డీ వచ్చేలా మార్పు చేశారు.
7. ఎలక్ట్రానిక్ బదిలీ(నెఫ్ట్, ఐఎమ్పీఎస్)
ఇంతకుముందు డిపాజిట్లను నగదు లేదా చెక్కు లేదా డీడీ రూపంలో మాత్రమే చేసేందుకు వీలుండేలా పథకం ఉండేది. ప్రస్తుతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆన్లైన్ లేదా ఎలక్ట్రానిక్ బదిలీలను చేసేందుకు సైతం అవకాశమిస్తున్నారు. ఏ పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఖాతా ఉందో అక్కడ కోర్ బ్యాంకింగ్ ఉంటే ఎలక్ట్రానిక్ బదిలీ చేయొచ్చు.
8. మెచ్యూరిటీ
అమ్మాయికి 21 ఏళ్లు రాగానే ఖాతా మెచ్యూర్ అయ్యేట్లు ఉండేది. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 21 ఏళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. ఖాతా తెరిచేసరికి అమ్మాయి వయసు 10 ఏళ్లు మించకూడదు.
9. విత్డ్రాయల్
ఇంతకు ముందు ఆడపిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఈ పథకంలో డిపాజిట్ అయిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం పదో తరగతి పాస్ అయి ఉన్నత విద్య కోసం డిపాజిట్ మొత్తంలో సగం వరకూ విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది.సుకన్య సమృద్ధి ఖాతా: లోపాల గురించి తెలుసుకోండి..!
Check gold rates in Hyderabad here