ATMను తాకకుండానే డబ్బులు ఉపసంహరణ
కరోనా మహమ్మారి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్కు ప్రాధాన్యత పెరిగింది. ATMల నుండి డబ్బులు ఉపసంహరించుకునే సమయంలోను చాలామంది ఏటీఎం మెషీన్ను తాకేందుకు కూడా వెనుకాడుతున్నారు. కరోనా కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాంకులు కూడా ఇందుకు అనుగుణంగా ఏటీఎం విత్ డ్రా చేసుకునే వారికి మెషీన్ను తాకకుండానే డబ్బులు వచ్చేలా సౌకర్యాన్ని వివిధ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. తాజాగా మాస్టర్ కార్డ్ ఏజీఎస్ ట్రాన్సక్ట్ టెక్నాలజీస్తో కలిసి పూర్తి కాంటాక్ట్లెస్ క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
క్యూఆర్ కోడ్ స్కానింగ్
మాస్టర్ కార్డ్ కలిగినవారు ATM స్క్రీన్ పైన కనిపించే క్విక్ రెస్పాన్స్ కోడ్(QR) కోడ్ ద్వారా డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. యూజర్లు తమ బ్యాంకు మొబైల్ అప్లికేషన్ నుండి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి.
ఆ తర్వాత ఎంత మొత్తం కావాలనే దానిని ఎంటర్ చేయాలి. అనంతరం పిన్ నెంబర్ టైప్ చేయాలి. ఆ తర్వాత ఏటీఎం మెషీన్ నుండి డబ్బులు విత్ డ్రా అవుతాయి.
మోసాలను కూడా తగ్గిస్తుంది
వాస్తవానికి ఏటీఎం మెషీన్ను తాకకుండానే లేదా తక్కువసార్లు తాకి నగదు ఉపసంహరించుకునే ప్రక్రియను ఇప్పటికే వివిధ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇది పూర్తి కాంటాక్ట్లెస్ కాదు. కానీ ఇప్పుడు ఏజీఎస్ గ్రూప్ టెక్నాలజీస్ మాత్రం పూర్తి కాంటాక్ట్లెస్ ఉపసంహరణ సౌకర్యాన్ని తీసుకు వచ్చింది.
ఇప్పటి వరకు ఏటీఎంను తాకాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మాస్టర్కార్డ్ నెట్వర్క్ ఉపయోగించే బ్యాంకులు ఈ ఏజీఎస్ ట్రాన్సక్ట్ టెక్నాలజీ ద్వారా తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని అందించవచ్చు. కరోనా నేపథ్యంలో ఇది ఉపయోగపడటంతో పాటు ఏటీఎం దగ్గర జరిగే మోసాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
మరింత సౌకర్యం, భద్రత
మాస్టర్ కార్డు భాగస్వామ్యంతో కాంటాక్ట్లెస్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చామని, కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని, భద్రతను కల్పించేలా ఇది ఉంటుందని, కాంటాక్ట్లెస్ టెక్నాలజీని పెంచడంలో క్యూఆర్ కోడ్ ఆధారిత క్యాష్ విత్డ్రా గేమ్-చేంజర్గా ఉంటుందని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎండీ, చైర్మన్ అన్నారు.