పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని ఎందుకు తాకాయి?
న్యూఢిల్లీ: చమురు ధరలు వరుసగా నాలుగు రోజులు పెరిగాయి. పెట్రోల్ లీటర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. నేడు పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 26 పైసల నుండి 29 పైసల మధ్య, డీజిల్ ధరలు 34 పైసల నుండి 38 పైసల మధ్య పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ 12 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.4.13, లీటర్ డీజిల్ పైన రూ.4.26 పెరిగింది. గత 11 నెలల కాలంలో రిటైల్ ధరలు తగ్గలేదు.
ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం
ఇంధన ధరలు, ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు. పెట్రోల్ ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కరోనా కారణంగా డీలా పడిన డిమాండ్, క్రమంగా పుంజుకుంటోంది. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరిగి తిరిగి కరోనా పూర్వస్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలోను ఆ ప్రభావం సహజం.
చమురు డిమాండ్ వెనుక
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ఉత్పత్తి మందగించడం, చమురు ఉత్పత్తి దేశాల్లో అస్థిరత లేదా ఉత్పత్తి కోత వంటి అంశాలు చమురు ధరల పైన ప్రభావం చూపుతాయి. కరోనా నుండి క్రమంగా ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ట్రాన్సుపోర్ట్, ఇండస్ట్రీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. పారిశ్రామిక రంగం పుంజుకోవడంతో చమురు డిమాండ్ పెరుగుతోంది. అలాగే, వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. ప్రయివేటు వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో చమురుకు డిమాండ్ పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ.88.14, డీజిల్ రూ.78.38, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.94.64, డీజిల్ రూ.85.32, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.90.44, డీజిల్ రూ.85.32, బెంగళూరులో పెట్రోల్ రూ.91.09, డీజిల్ రూ.83.09, కోల్ కతాలో పెట్రోల్ రూ 89.44, డీజిల్ ధర రూ .81.96గా ఉంది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో పెట్రోల్ రూ.91.65, డీజిల్ రూ.85.50, అమరావతిలో పెట్రోల్ రూ.94.28, డీజిల్ రూ.87.62గా ఉంది.