లోన్ మారటోరియం గుడ్న్యూస్: ఎవరు అర్హులు, ఎంత లబ్ధి? EMI చెల్లించిన వారికి ప్రయోజనం ఎంత?
దసరా, దీపావళి పండుగ సమయంలో రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. రుణ మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకున్నా.. ఉపయోగించుకోకపోయినా రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్ర వడ్డీని మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ మాఫీని సాధ్యమైనంత త్వరగా చేయాలని, ప్రజల దీపావళి కేంద్రం చేతుల్లో ఉందని ఇటీవల జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజాగా కేంద్రం చక్రవడ్డీ మాఫీపై మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడుతోంది.
ట్యాక్స్పేయర్స్కు ఊరట, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
నవంబర్ 5లోపు చెల్లింపు... మార్గదర్శకాలివే
ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు ప్రకటించిన మారటోరియంపై చక్రవడ్డీ మాఫీ ఉంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రూ.2 కోట్ల లోపు రుణఖాతాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
చక్రవడ్డీ మాఫీ వర్తించాలంటే ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సదరు రుణ ఖాతా మొండి బకాయిగా ఉండరాదు.
హోమ్ లోన్, హౌసింగ్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలతో పాటు వినియోగ రుణాలు, గృహోపకరణాల కొనుగోలు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు చక్రవడ్డీ మాఫీ పథకం పరిధిలోకి వస్తాయి.
సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా నగదును బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అర్హులైన రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలి. నవంబర్ 5వ తేదీలోగా ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి.
జమ చేసిన ఈ సొమ్మును కేంద్రం భరిస్తుంది. కేంద్రం రుణదాతలకు ఇస్తుంది.
ఈ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటే
ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారు అందరూ అర్హులే.
మార్చి 27న ఆర్బీఐ మారటోరియం ప్రకటించింది. ఆగస్ట్ 31 వరకు మారటోరియం వెసులుబాటు కల్పించారు. చక్రవడ్డీ మాఫీతో ఎంఎస్ఎంఈలకూ లాభం కలుగుతుంది.
ఎంఎస్ఎంఈ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, కన్స్యూమర డ్యూరబుల్ లోన్, క్రెడిట్ కార్డ్ డ్యూస్, ఆటో లోన్, పర్సనల్ లోన్, ప్రొఫెషనల్, కన్సంప్షన్ లోన్ తీసుకున్న వారు అర్హులు.
రుణగ్రహీతలకు ఇలా లబ్ధి...
ఉదాహరణకు మార్చి 1వ తేదీకి ముందు రూ.30 లక్షలు, రూ.50 లక్షలు, రూ.70 లక్షలు (అసలు-వడ్డీ కలిపి) రుణం కలిగి ఉంటే.. 7.5 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్కిద్దాం. మారటోరియం ఆర్నెల్ల కాలానికి చక్రవడ్డీ రూ.30 లక్షలు, రూ.50 లక్షలు, రూ.70 లక్షలపై వరుసగా రూ.1,14,272, రూ.1,90,455, రూ.2,66,635 ఉంటుంది. సాధారణ వడ్డీ రూ.1,12,500, రూ.1,87,500, రూ.2,62,500గా ఉంటుంది. వడ్డీపై వడ్డీ మాఫీ కారణంగా వరుసగా నికర ఆదా రూ.1,772, రూ.2,995, రూ.4,135గా ఉంటుంది. అంటే 1.6 శాతం మేర సేవింగ్ ఉంటుంది.
మారటోరియం చెల్లించని వారికి..
మార్చి 1వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీ మధ్య సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య ఉన్న తేడా సొమ్మును నిర్దేశిత రుణ ఖాతాదారులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్రం భరిస్తుంది. మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకోకుండా ఈఎంఐలు చెల్లించిన వారికి కూడా ప్రయోజనం కలగనుంది. ఎప్పటిమాదిరిగా ఈఎంఐలు చెల్లించినవారికి 8 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన 6 నెలలకు 4 శాతం వడ్డీని పరిహారంగా చెల్లించాలి. ఈ ప్రకారంగా రూ.1 కోటి హోంలోన్ తీసుకొని మారటోరియం కాలంలో క్రమంగా చెల్లించిన వారికి రూ.16,270 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.