ఈ ప్రభుత్వ పథకాల ద్వారా మంచి రిటర్న్స్, 0% రిస్క్
కరోనా తర్వాత పెట్టుబడులపై ఆసక్తి పెరిగింది. స్టాక్ మార్కెట్ నుండి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వరకు రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్తో కూడుకున్నది. కాబట్టి వృద్ధులు, రిస్క్ తీసుకోవడం ఇష్టపడని వారు చాలామంది సురక్షిత పెట్టుబడులకు మొగ్గు చూపుతారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సురక్షిత, జీరో పర్సెంట్ రిస్క్ కలిగిన పలు పథకాలు ఉన్నాయి. వాటిలో సావరీన్ గోల్డ్ బాండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఉన్నాయి. ప్రభుత్వ స్కీమ్లలో అధిక రిటర్న్స్ ఉండవని కొంతమంది అభిప్రాయం. కానీ అధిక వడ్డీ రేటు ఇచ్చే పలు స్కీమ్స్ ఉన్నాయి. వీటితో పాటు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
సావరీన్ గోల్డ్ బాండ్
కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసే సావరీన్ గోల్డ్ బాండ్(SGB) స్కీమ్ 2015లో ప్రారంభమైంది. కేంద్రంతో సంప్రదించిన అనంతరం ఆర్బీఐ SGB వడ్డీ రేటును, టర్మ్స్ అండ్ కండిషన్స్ను, మెచ్యూరిటీని నిర్ణయిస్తుంది. ఈ స్కీం కింద 2.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. వడ్డీ మొత్తం సబ్స్క్రైబర్స్ అకౌంట్కు ఆరు నెలలకు పడుతుంది. SGB సర్టిఫికెట్తో రుణం కూడా పొందవచ్చును. ఐటీ చట్టం 1961 కింద బాండ్స్ పైన పన్ను వర్తిస్తుంది. 2022లో SGB జనవరి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఇష్యూ చేస్తున్నారు. బాండ్స్ను జనవరి 18న ఇష్యూ చేస్తారు. ఏడాదికి వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంటుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్
కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)తో రిటైర్మెంట్ తర్వాత ఆదాయ ధీమా ఉంటుంది. దీనిని 2004లో ప్రారంభించారు. అయితే ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ స్కీం అందుబాటులో ఉంది. 2009లో కేంద్రం ఉద్యోగులందరికీ ఈ స్కీంను వర్తింప చేసింది. సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రయివేటు రంగ ఉద్యోగులు సహా అందరికీ వర్తిస్తుంది. ఈ స్కీంను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రన్ చేస్తోంది. ఈ స్కీం కింద సబ్స్క్రైబర్లు తమ పెట్టుబడిపై 10 శాతం నుండి 15 శాతం వడ్డీని పొందుతారు.
18 ఏళ్ల నుండి 60 ఏళ్ల భారతీయులు ఈ స్కీంలో చేరవచ్చు. తమ నెలవారీ మొత్తం నుండి కొంత పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వడ్డీ రేటు మార్కెట్ లింక్ కలిగి ఉంది. సెక్షన్ 80సీసీడీ(1), 80సీసీడీ1(బీ) కింద సబ్స్క్రైబర్లు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కంస్కీమ్(POMIS)
POMIS సంప్రదాయ పొదుకు ఖాతా వలె పని చేస్తుంది. అయితే ఇది FD వలె ఉంటుంది. అలాగే నెలవారీ ఇన్కంతో కూడుకున్నది. ఇండివిడ్యువల్ అకౌంట్ హోల్డర్స్ కనీసం రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఖాతాదారు అదే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని నెలవారీగా పొందుతారు. ప్రస్తుతం వడ్డీ రేటు ఏడాదికి 6.6 శాతంగా ఉంది. ఈ ఖాతా ఓపెన్ చేసిన నెల రోజుల తర్వాత వడ్డీ చెల్లిస్తారు. భారతీయులందరికీ ఇది అందుబాటులో ఉంది. ఇద్దరు లేదా ముగ్గురు జాయింట్గా రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతం (ప్రస్తుతం) వడ్డీ రేటుతో దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక. ఇది రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఇది ప్రభుత్వ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలలో ఒకటి. సాధారణంగా ఇది ప్రభుత్వ పెన్షన్ స్కీం కిందకు రాని వారి కోసం, అసంఘటిత రంగంలో పని చేసే వారి కోసం లేదా ఈపీఎఫ్ పరిధిలోకి రాని వారి కోసం ప్రారంభించారు. పదవీ విరమణ నిధిని నిర్మించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాత అయిదేళ్లు పొడిగించవచ్చు. పీపీఎఫ్లో మూడో ఏడాది నుండి ఆరో ఏడాది వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వడ్డీపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంది. పదిహేనేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత అయిదేళ్ల చొప్పున కూడా పొడిగించుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC) సమీప పోస్టాఫీస్లో ప్రారంభించే స్థిర ఆదాయ పెట్టుబడి. ఇది తక్కువ రిస్క్, స్థిర ఆదాయ సాధన పథకం. ఇది పన్ను అనుకూల సేవింగ్స్ బాండ్. ఖాతాదారులను మనీ సేవింగ్స్ దిశగా ప్రోత్సహిస్తుంది. ఇది పీపీఎఫ్, పోస్టాఫీస్ FD తరహా ఉంటుంది. మైనర్ పేరు మీత కూడా స్థానిక పోస్టాఫీస్లో పెద్దవారితో కలిసి జాయింట్ అకౌంట్ తీయవచ్చు. డిపాజిట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిదేళ్లు. కనిష్టంగా రూ.1000. ఒకటికి మించి ఖాతాలు తెరువవచ్చు. చట్టంలోని ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది.