కేంద్రం కీలక నిర్ణయం, టెల్కో స్టాక్స్ అదుర్స్: ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో ఎంత లాభం వచ్చిందంటే?
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి వాటికి భారీ ఊరటను కల్పిస్తూ సవరించిన మొత్తం ఆదాయం(AGR) బకాయిలకు సంబంధించి నాలుగున్నరేళ్ల మారటోరియం వెసులుబాటును కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య టెలికం సంస్థలకు ఇంటరిమ్ క్యాష్ ఫ్లో రిలీఫ్ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఏజీఆర్ బకాయిలు టాప్ 3లోని మూడు టెలికం సంస్థలకు భారంగా మారాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాటికి ఊరటను ఇచ్చి, నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది. టెలికం రంగానికి సంబంధించి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మారటోరియం... హేతుబద్దీకరణ
టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏజీఆర్కు సంబంధించి ప్రస్తుతమున్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో AGR నిర్వచనాన్ని కేంద్రం హేతుబద్దీకరిస్తున్నట్లు తెలిపింది. ఇకపై టెలికామేతర ఆదాయాలను AGR నుండి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు, AGR బకాయిల కింద టెల్కోలు చెల్లించాల్సిన మొత్తాలపై మారటోరియం విధించింది. అలాగే, టెలికం రంగంలోకి 100 శాతం FDIలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందని కేంద్రం చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో టెలికం రంగానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
స్పెక్ట్రం ఛార్జీలు
ప్రభుత్వానికి చెందిన స్పెక్ట్రంను వినియోగిస్తున్నందుకు గాను అన్ని టెలికం వ్యాపారాలు కూడా స్పెక్ట్రం ఛార్జీలు, లైసెన్స్ ఫీజు కింద తమ ఆదాయంలో కొంత భాగాన్ని డిపార్టుమెంట్ ఆప్ టెలికమ్యూనికేషన్స్ (DoT)కు చెల్లించాలి. నిన్న టెలికం రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవడంతో రెండు రోజులుగా ఈ కంపెనీల స్టాక్స్ జంప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు స్టాక్స్ పాపులర్ స్టాక్స్ ఇక్కడ చూడండి... భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, ఎంటీఎన్ఎల్, ఇండస్ టవర్ ఉన్నాయి.
ఏ స్టాక్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది
భారతీ ఎయిర్టెల్ లేదా ఎయిర్టెల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. గత మూడేళ్ల కాలంలో ఎయిర్టెల్ స్టాక్ 80.97 శాతం రిటర్న్స్ అందించింది. ఇదే కాలంలో ఎస్ అండ్ పీ బీఎస్ఈ టెలికం ఇండెక్స్ 46.34 శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. నిఫ్టీలోను ఇదే విధంగా ఉంది. భారతీ ఎయిర్టెల్ రుణాల్లో 22 శాతం ఫారెన్ కరెన్సీ డినామినేటెడ్. రూపాయి క్షీణిస్తే ఒత్తిడి ఉంటుంది. యాన్యువల్ సేల్స్ వృద్ధి రేటు 13.17 శాతంగా ఉంది. కంపెనీ మూడేళ్ల CAGR 6.39 శాతం.
వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత వొడాఫోన్ ఐడియా షేర్ రెండు రోజులుగా పెరుగుతోంది. నేడు మరో 25 శాతం లాభపడి రూ.11 దాటింది. ఐదు రోజులు, వందరోజుల గరిష్టాన్ని తాకింది.
టాటా టెలీ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. బ్రాడ్ బాండ్, టెలీ కమ్యూనికేషన్ కంపెనీ. టాటా గ్రూప్ సబ్సిడరీ. ఈ స్టాక్ గత మూడేళ్లలో 632.99 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం ఇదే కాలంలో 52 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 1986లో ప్రారంభమైన ఎంటీఎన్ఎల్ మూడేళ్లలో 17.72 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ టెలికం ఇండెక్స్ మాత్రం 46.34 శాతం రిటర్న్స్ అందించింది.
భారతీ ఎంటర్ప్రైజెస్ మరో యూనిట్ ఇండస్ టవర్. ఈ స్టాక్ గత మూడేళ్లలో 10.32 శాతం క్షీణించింది. నిఫ్టీ 100 స్టాక్స్ 49.67 శాతం అందించాయి.