నాడు-నేడు: ఈ నాలుగు కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ లాభాలు..ఎలా సాధ్యమైంది..?
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు తమ డబ్బు 2-4 రోజుల్లోగా రెట్టింపు అవుతుందనే భావనలో ఉంటారు. సాధారణంగా ఇలాంటి మైండ్ సెట్తో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రెండు నుంచి నాలుగు రోజుల్లోగా అధిక లాభాలు లేదా ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన దానికంటే రెట్టింపు అవుతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుందని చెబుతున్నారు. ఈ ఆలోచనతో ఎప్పుడూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదని సలహా ఇస్తున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేముందు దీర్ఘకాలిక లాభాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.దీర్ఘకాలంకు ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా లాభాలు పొందుతారు. గత 20 ఏళ్లలో స్టాక్ మార్కెట్లు బాగా పెరిగాయి. గత 20 ఏళ్లలో మంచి లాభాలు కనబర్చిన 4 స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం...
20 ఏళ్లలో ఐషర్ మోటార్స్ లాభం..
గత 20 ఏళ్లలో మంచి లాభాలు చూసిన స్టాక్స్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఐషర్ స్టాక్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఐషర్ మోటార్ స్టాక్స్ 2001 ఆగష్టు 31వ తేదీన కేవలం రూ.1.77గా ఉన్నింది. ఇది నేటికి రూ.32.15తో బలపడి రూ.2579 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 20 ఏళ్లలో 145609 శాతం రాబడిని పెట్టబడిదారుడికి అందించింది.అంతేకాదు వారు ఇన్వెస్ట్ చేసిన డబ్బు దాదాపు 1456 రెట్లకు పెరిగింది. 2001లో ఐషర్ స్టాక్స్పై ఎవరైనా రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఆవ్యక్తి పెట్టుబడి నేటికి రూ. 14,56,00,000 చేరి ఉంటుంది.
ఇన్వెస్టర్లకు మరో వరంగా ఏషియన్ పెయింట్స్
ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చడంలో ఏషియన్ పెయింట్స్ కూడా ముందుంది. 2001 ఆగష్టు 31వ తేదీ రోజున ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ కేవలం రూ.17.63 గా ఉన్నింది. అది ఈ రోజుకు రూ.2.95 మేరా తగ్గి రూ.3043 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 20 సంవత్సరాలలో 17160 శాతం రాబడిని అందించింది మరియు పెట్టుబడిదారుల డబ్బును 171 రెట్లు ఎక్కువ చేసింది. ఆ సమయంలో ఎవరైనా రూ. లక్ష పెట్టి ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ను కొనుగోలు చేసి ఉన్నట్లయితే వారి పెట్టుబడి నేటికి రూ.17 మిలియన్ మార్క్ను టచ్ చేసి ఉంటుంది.
లాభాల బాటలో ఎంఆర్ఎఫ్
గత 20 ఏళ్లలో ఎంఆర్ఎఫ్ కూడా క్రమంగా లాభాల బాట పట్టింది. 2001 ఆగష్టు 31న ఎంఆర్ఎఫ్ స్టాక్ ధర రూ.480.9గా ఉన్నింది. నేటికి అది రూ.153.70 మేరా బలహీనపడి రూ.77వేల వద్ద ముగిసింది. 20 ఏళ్ల క్రితం ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి 15812 శాతం మేరా రాబడిని తెచ్చిపెట్టింది. అదే సమయంలో 158 రెట్లు మేరా ఇన్వెస్టర్ సంపద పెరిగింది. నాడు రూ.లక్ష పెట్టి ఎంఆర్ఎఫ్ స్టాక్స్ కొనుగోలు చేసినట్లయితే నేడు ఆ అమౌంట్ రూ.15800000 మేరా దాటి ఉంటుంది.
ఇన్ఫోసిస్ కూడా మంచి రాబడి
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కూడా గత 20 ఏళ్ల నుంచి చూస్తే మంచి లాభాలను అందించిందని నిపుణులు చెబుతున్నారు. 2001 ఆగష్టు 31వ తేదీ నాటికి దీని షేరు ధర రూ.55.29గా ఉన్నింది. నేడు రూ.16.45 మేరా బలపడి రూ.1737.20 వద్ద ముగిసింది. ఈ స్టాక్ను పరిశీలిస్తే గత 20 ఏళ్లలో 3041 శాతం రాబడిని అందించింది. అదే సమయంలో ఇన్వెస్టర్ డబ్బును 30 రెట్లు పెంచేసింది. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి రూ.లక్ష పెట్టి ఇన్ఫోసిస్ స్టాక్స్ కొనుగోలు చేసినట్లయితే నేడు దాని విలువ రూ.30 లక్షలు దాటి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేముందు..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ లేదా పెట్టుబడి పెట్టేముందు పలు కీలక అంశాలను తెలుసుకోవాలి. ఏదో ఓవర్నైట్లో లాభాలు రావాలని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక ట్రేడర్గా డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టమైన పని. మంచి డబ్బులు స్టాక్స్లో సంపాదించాలంటే ఇందులోని సాంకేతిక అంశాలు, బేసిక్ వివరాలు, మార్కెట్ ఫండమెంటల్స్ లాంటి అంశాలను తెలుసుకోవాలి.అంతేకాదు ట్రేడింగ్ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకుని చాలా తెలివితో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.