Q3 ఎఫెక్ట్: టీసీఎస్ మూడ్రోజుల్లో రూ.85,000 కోట్లు అప్, ఇన్వెస్ట్ చేయవచ్చా.. టార్గెట్ ధర ఇదీ
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ అనూహ్యంగా పెరిగింది. గత శుక్రవారం మార్కెట్ క్లోజింగ్ అనంతరం టీసీఎస్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫలితాలు అదరగొట్టాయి. దీంతో నాటి నుండి స్టాక్స్ జంప్ అవుతున్నాయి. దీనికి తోడు టీసీఎస్ టార్గెట్ ధర పెంపు, ఇన్ఫోసిస్, విప్రోవంటి ఇతర ఐటీ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండంతో టీసీఎస్ షేర్ అంతకంతకూ పెరుగుతోంది.
రిలయన్స్ను టీసీఎస్ దాటుతుందా?
నిన్న మార్కెట్ క్లోజింగ్ సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్కు మరింత దగ్గరకు వచ్చింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్లో రిలయన్స్ రూ.1242910.75 మార్కెట్ క్యాపిటలాజేషన్తో మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్ రూ.1219581.32 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మరో రూ.20 వేల కోట్లు పెరిగితే రిలయన్స్ను దాటవేస్తుంది. అదే జరిగితే దేశీయ లిస్టెడ్ కంపెనీల్లో అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన రిలయన్స్ను వెనక్కి నెట్టి టీసీఎస్ ముందుకు వస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ స్టాక్స్ పుంజుకుంటుంటడం గమనార్హం.
రూ.85,000 కోట్లు జంప్
గత శుక్రవారం టీసీఎస్ ఫలితాలు వెల్లడయ్యాయి. అప్పటి నుండి టీసీఎస్ షేర్ అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఈ షేర్ ఓ సమయంలో 3 శాతం పెరిగి రూ.3261ని తాకింది. అయితే ఫలితాలు వచ్చిన ఈ మూడు నాలుగు సెషన్లలోనే ఏంగా 7.5 శాతం లాభపడి రూ.85,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పెంచుకుంది. ఓ సమయంలో ఎం-క్యాప్ రూ.12.23 లక్షల కోట్లకు కూడా చేరుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ మంచి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
టీసీఎస్ టార్గెట్ ధర
టీసీఎస్ షేర్ టార్గెట్ ధరను రూ.4176గా ఎడెల్వెసిస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ రూ.3,244 (గురువారం ముగింపు) వద్ద ఉంది. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీగా, అలాగే, దేశీయ రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. మున్ముందు ఐటీ కంపెనీలకు మరింత బావుంటుందని చెబుతున్నారు.