SSY Scheme: ఇలా చేస్తే కూతురు పెళ్లి నాటికి మీ చేతికి రూ.71 లక్షలు
కేంద్ర ప్రభుత్వం వివిధ పెట్టుబడి పథకాలను అందిస్తోంది. పెళ్లీడికి వచ్చేసరికి కూతురు పెళ్లి భారం కాకుండా ఉండేందుకు కేంద్రం సుకన్య సమృద్ధి యోజన (SSY) పేరుతో ఓ అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్కీంలో రూ.1000 నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు. కూతురుకు 18 ఏళ్లు వచ్చాక సగం ఉపసంహరించుకోవచ్చు. అలాగే పెళ్లి సమయానికి మొత్తాన్ని తీసుకోవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. పెళ్లితో పాటు చదువుకు కూడా ఉపయోగపడే పథకం ఇది. డిఫాల్ట్ లేకుండా మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే రూ.71 లక్షల వరకు చేతికి వస్తాయి. ఈ డిపాజిట్ పైన ఆదాయ పన్ను మినహాయింపు ఉంది.
గరిష్టంగా రెండు ఖాతాలు
చాలామందికి పర్సనల్ ఫైనాన్సింగ్ తెలియదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం వివిధ పొదుపు పథకాలను ప్రారంభించింది. ఈ ప్రభుత్వ పథకాల ద్వారా మన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆదా చేయవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోడీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించారు. పదేళ్ల లోపు ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు దీనిని ప్రారంభించవచ్చు. పదిహేనేళ్ల పాటు కాంట్రిబ్యూట్ చేయాలి. సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. తల్లిదండ్రులు గరిష్టంగా రెండు ఖాతాలు అంటే ఇద్దరు కూతుళ్లపై ఈ ఖాతాను తెరువవచ్చు.
పరిమితి.. ఉపసంహరణ
వ్యక్తులు ఏడాదికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాలు లేదా ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండి వివాహం అయ్యే వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఉన్నత విద్య కోసం 18 ఏళ్లు నిండిన తర్వాత బ్యాలెన్స్ నుండి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత పదిహేనేళ్లు క్రమంగా జమ చేయాలి.
15 ఏళ్లు చెల్లిస్తే రూ.71 లక్షలు
సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షతా భావం పోగొట్టే లక్ష్యంతో 2015లో బేటీ బచావో, బేటీ పడావో పాలసీని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజనను తీసుకు వచ్చింది. ఈ స్కీంలో ఎలాంటి డిఫాల్ట్ లేకుండా 15 ఏళ్ల పాటు నెలకు రూ.12,500 కడితే మెచ్యూరిటీ సమయానికి రూ.71 లక్షల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి రూ.60వేలు దఫాలుగా 15 ఏళ్లు జమ చేస్తే వడ్డీ రేటు ఆధారంగా రూ.28 లక్షలకు పైన రావొచ్చు.