రూ.3,000 వరకు తక్కువకు బంగారం.. రేపటి నుండి గోల్డ్ బాండ్స్
కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్ బాండ్స్ను తీసుకు వస్తోంది. సోమవారం నుండి వీటిని విక్రయిస్తుంది. కేంద్రప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గోల్డ్ బాండ్స్ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇది సిరీస్ VII గోల్డ్ బాండ్స్. అక్టోబర్ 12వ తేదీన ప్రారంభం కానున్న ఈ గోల్డ్ బాండ్స్ అక్టోబర్ 16వ తేదీన ముగియనుంది.
అక్టోబర్ 20వ తేదీన గోల్డ్ బాండ్స్కు సంబంధించిన సర్టిఫికేట్ అందిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని డిజిటల్ చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. పెట్టుబడిదారులకు బాండ్ ఇష్యూ ధర గ్రాము పసిడికి రూ.5,051. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం సిరీస్ 1 బాండ్స్ జారీ చేసింది.
నల్లధనంపై పోరులో 'రెండో' అడుగు! భారత్ చేతికి స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు
ఆన్లైన్లో కొంటే రూ.500 తక్కువ
బంగారాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా చూస్తారు పెట్టుబడిదారులు. పసిడికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015న కేంద్రం ప్రారంభించింది. గోల్డ్ బాండ్ గ్రాము రూ.5.051 కాగా, 10 గ్రాముల పసిడి రూ.50,510 అవుతుంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తే 1 గ్రాము రూ.5,001కి వస్తుంది. 10 గ్రాములు రూ.50,010 అవుతుంది.
మెచ్యూరిటీ, కొనుగోలు ఎలా
గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిదేళ్లు. అయిదేళ్ల తర్వాత అవసరం అయితే బాండ్స్ను విక్రయించి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం పసిడి ధర ఫ్యూచర్ మార్కెట్లో రూ.51వేల సమీపంలో, బులియన్ మార్కెట్లో రూ.53వేల వరకు ఉంది. ఈ ధరలతో పోలిస్తే రూ.3,000 తక్కువ పలుకుతుంది. కనీసం ఒక గ్రాము బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి కోసం బంగారాన్ని ఎంచుకునే వారికి గోల్డ్ బాండ్స్ మంచి ఆప్షన్. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో, ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవచ్చు. ఎంపిక చేసిన పోస్టాఫీస్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్స్ పైన 2.5 శాతం వడ్డీ వస్తుంది.
ఈ లాభాలు
గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. వీటిని డీ-మ్యాట్ అకౌంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఎలాంటి జీఎస్టీ ఉండదు. కానీ భౌతిక బంగారం కొంటే జీఎస్టీ ఉంటుంది. ఇంట్లో ఉండే బంగారంపై ఎలాంటి వడ్డీరాదు. సిరీస్ 8 గోల్డ్ బాండ్స్ సేల్ నవంబర్ 8వ తేదీన ప్రారంభమై 13న ముగుస్తుంది. సిరీస్ 9 డిసెంబర్లో, సిరీస్ 10 జనవరిలో, సిరీస్ 11 ఫిబ్రవరిలో, సిరీస్ 12 మార్చిలో ఉండనుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 37 విడతల్లోని గోల్డ్ బాండ్స్ ద్వారా 30..98 టన్నుల బాండ్స్ను సేకరించింది.