Sovereign Gold Bond: సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చా?
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం FY22 సిరీస్ V పసిడి బాండ్స్ను జారీ నేటి నుండి జారీ చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుండి (సోమవారం) అయిదు రోజుల పాటు ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం ఐదో విడత జారీ చేయనున్న ఈ బాండ్ ధరను రూ.4,790గా నిర్ణయించింది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, డిజిటల్ పద్ధతిలో ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 చొప్పున రాయితీ ఇస్తుంది. వారికి రూ.4740కే వస్తుంది. ఆగస్ట్ 13వ తేదీ వరకు సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ కొనుగోలు చేయవచ్చు
భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడం, దేశీయ పొదుపులో కొంతభాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని 2015 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బ్యాంకు, పోస్టాఫీస్ తదితర చోట్ల ఈ స్కీం అందుబాటులో ఉంటుంది.
స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్పై పెట్టుబడిదారులకు ఏడాదికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.
ఆ వడ్డీపై పన్ను
సార్వభౌమ పసిడి బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. మెచ్యూరిటీ వరకు అట్టిపెడితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదు.
ముందే నిష్క్రమిస్తే
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లకు ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.
కొనుగోలు పరిమితి
కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్ట్స్ వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు. ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.
స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్
గోల్డ్ బాండ్స్ను స్టాక్ ఎక్స్చేంజీలలో కూడా లిస్ట్ చేస్తారు. అంటే స్టాక్ ఎక్స్చేంజీ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఒకవేళ ఏడాదికి ముందే విక్రయిస్తే వచ్చిన లాభాల్ని పెట్టుబడిదారు ఆదాయానికి కలిపితే స్లాబ్ రేటు ప్రకారం పన్ను ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత లాభాలను దీర్ఘకాలికంగా పరిగణిస్తారు. 10 శాతం పన్ను ఉంటుంది.
ఇన్వెస్ట్ చేయవచ్చా?
FY22లో ద్రవ్యోల్భణం 5.7 శాతంగా ఉండవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంచనా వేస్తోంది. గతంలో వేసిన 5.1 శాతం అంచనా కంటే ఇది కాస్త ఎక్కువే. మనం అధిక ద్రవ్యోల్భణంలోకి వెళ్తున్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు సావరీన్ గోల్డ్ బాండ్స్ ద్వారా బంగారానికి కేటాయించవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇటీవల బంగారం ధరలు భారీగా తగ్గాయని, మున్ముందు కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, బంగారంపై పెట్టుబడికి ఇది కూడా మంచి సమయంగా భావించవచ్చునని అంటున్నారు. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.10,000కు పైగా తక్కువగా ఉన్నాయి. గత నెలలో రూ.50,000 కూడా తాకాయి. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తున్నాయి.
వెండి ధరలు కూడా రూ.70,000 స్థాయి నుండి రూ.64,000 దిగువకు వచ్చాయి. బంగారం ధరలు గత రెండు సెషన్లలోనే రూ.1600 తగ్గాయి. వెండి దాదాపు రూ.4000 క్షీణించింది.