Sovereign Gold Bonds: సోమవారం నుండి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం అక్టోబర్ 25వ తేదీన ప్రారంభం కానుంది. ఈ స్కీం నాలుగు రోజుల పాటు ఉంటుంది. ఈ సావరీన్ గోల్డ్ బాండ్స్ను కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్లియరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, డిజిగ్నేటెడ్ పోస్టాఫీస్లు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్ ఈ గోల్డ్ బాండ్స్ను విక్రయించవు. ఈ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 ఆర్థిక సంవత్సరంలో VII విడత స్కీం. అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు విక్రయిస్తారు. ఈ బాండ్స్ను నవంబర్ 2న జారీ చేస్తారు.
అలా రూ.500 తగ్గింపు
ఆన్ లైన్ ద్వారా గోల్డ్ బాండ్ స్కీం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. అంటే 10 గ్రాముల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తే రూ.500 తక్కువ అవుతుంది. ఈ బాండ్స్ను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది.
గోల్డ్ బాండ్ పథకం ప్రారంభం నుండి 2021 మార్చి చివరి వరకు ప్రభుత్వానికి రూ.25,702 కోట్లు వచ్చాయి. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది.
బ్యాంకు ద్వారా సబ్స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్లలో కూడా అందుబాటులో ఉంటాయి. గోల్డ్ బాండ్స్ పెట్టుబడులకు 2.50 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పసిడి బాండ్స్పైన పెట్టుబడిదారులకు సంవత్సరానికి ఇచ్చే 2.50 శాతం వడ్డీ రేటును రెండు దభాలుగా చెల్లిస్తారు. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది.
వడ్డీ చెల్లింపు
ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పసిడి దిగుమతులు తగ్గించి ఆర్థిక లోటును అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.
భౌతిక బంగారు నాణేలు కొనడం, నిల్వ చేయడం, అమ్మడం వంటి ఖర్చులను ప్రభుత్వం ఆదా చేస్తోంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యం కూడా సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం ఉద్దేశ్యం.
ధర నిర్ణయం
బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకటించిన 999 స్వచ్ఛత బంగారం ముగింపు సగటు ధర ఆధారంగా సబ్స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి 3 పని దినాల ధర ఆధారంగా గోల్డ్ బాండ్ ధర భారత కరెన్సీ రూపాయిలలో నిర్ణయిస్తారు. 1 గ్రామ్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఎనిమిదేళ్లు బాండ్ పీరియడ్ ఉంటుంది. 5వ సంవత్సరం తర్వాత నిష్క్రమణకు అవకాశముంది. మెచ్యూరిటీ ధర అప్పటి ధరపై ఆధారపడి ఉంటుంది.
స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేయవచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లోను దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు. ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మెచ్యూరిటీకి ముందు గోల్డ్ బాండ్స్ తీసుకోవాలనుకుంటే కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంకు లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీస్ లేదా ఏజెంట్ను సంప్రదించాలి.
కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒకరోజు ముందు పెట్టుబడిదారు సంబంధిత బ్యాంకు/పోస్టాఫీసును సంప్రదిస్తేనే ముందస్తు ఉపసంహరణ అభ్యర్థనలు ఆమోదం పొందుతాయి. బాండ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో అందించిన బ్యాంకు ఖాతాకు ఆదాయం జమ అవుతుంది. అయిదో సంవత్సరం తర్వాత తీసుకుంటే లాభాలపై పోస్ట్ ఇండెక్సేషన్తో 20% పన్ను వర్తిస్తుంది.