ఏమిటీ గోల్డ్ బాండ్స్: ఎలా కొనుగోలు చేయాలి, వడ్డీ ఎంత.. ప్రయోజనాలెన్నో
ముంబై: బంగారంలో పెట్టుబడి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రెండో దశ గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ నేడు ప్రారంభమైంది. 2020-21లో సిరీస్ 2 సబ్స్క్రిప్షన్ మే 15వ తేదీన ముగుస్తుంది. తాజా ఇష్యూ ధరను రూ.4,590గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇష్యూ తేదీ మే 19. అంటే ఆ రోజున బాండ్స్కు సంబంధించి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. అలాంటి పెట్టుబడిదారులకు బాండ్ ఇష్యూ ధర గ్రాము పసిడికి రూ.4,540. ఈ బాండ్స్ను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది.
నేటి నుండి గోల్డ్ బాండ్స్ విక్రయం: ఇష్యూ ధర, ఆఫర్.. వివరాలు ఇవీ
ఏమిటీ సావరీన్ గోల్డ్ బాండ్స్
ఏప్రిల్ నెలలో ప్రభుత్వం సిరీస్ 1 బాండ్స్ జారీ చేసింది. బంగారం బలమైన పెట్టుబడిని ఆకర్షిస్తోంది. దీనికి డిమాండ్ పెరగడంతో మరోసారి జారీ చేసింది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 15వ తేదీన కేంద్రం ప్రారంభించింది.
ఈ బాండ్స్ ఎలా పొందవచ్చు, వడ్డీ ఎంత?
బ్యాంకు ద్వారా సబ్స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్లలో కూడా అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్ కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రెండు దభాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.
మొదటి ఆరు నెలలకు బాండ్స్ జారీ
సంవత్సరానికి మొదటి ఆరు నెలలకు బంగారు బాండ్స్ జారీ కాల పట్టికను ఆర్బీఐ విడుదల చేసింది. రాబోయే నాలుగు నెలలకు జారీ చేసిన గోల్డ్ బాండ్స్ ఇలా..
2020-21 సిరీస్ III-జూన్ 05 నుండి 12వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్-ఇష్యూ తేదీ జూన్ 16, 2020.
2020-21 సిరీస్ IV-జూలై 06 నుండి 10వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్. ఇష్యూ తేదీ జూలై 14, 2020
2020-21 సిరీస్ V-ఆగస్ట్ 03 నుండి 07వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్. ఇష్యూ తేదీ ఆగస్ట్ 11, 2020
2020-21 సిరీస్ VI- ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 04వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్. ఇష్యూ తేదీ సెప్టెంబర్ 04, 2020
పన్ను ఎలా..
సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదు.
ముందే ఎలా నిష్క్రమించవచ్చు
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మీ స్థూల మొత్తం ఆదాయానికి జోడించి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ వద్ద ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మూడేళ్లకు పైబడి ఉండే దీర్ఘకాలిక లాభాలు 20.8 శాతం పన్ను వర్తిస్తుంది.
ఎంత వరకు కొనవచ్చు
కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు.
రుణ సదుపాయం ఉంటుంది
ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు. ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.