పదో విడత గోల్డ్ బాండ్ ధర, ప్రయోజనాలు: ఆ ధర కంటే ఎక్కువే!
సావరీన్ గోల్డ్ బాండ్స్ 2020-21 సిరీస్ X సబ్స్క్రిప్షన్ నేడు (జనవరి 11) ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఈ బాండ్స్ను జారీ చేస్తోంది. పెట్టుబడికి హామీ ఉంటుంది. గ్రాము బంగారం రూ.5,104గా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపితే గ్రాముకు రూ.50 తగ్గుతుంది. ఆన్లైన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి గ్రాముకు రూ.5,054కి అందుబాటులోకి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15, 2021. అయితే సావరీన్ గోల్డ్ బాండ్ నేటి బంగారం ధర కంటే కాస్త ఎక్కువగా ఉంది. నేడు 10 గ్రాముల పసిడి రూ.49,200 వద్ద ఉంది. అంటే 1 గ్రాముకు రూ.4,920గా ఉంది. పది గ్రాముల పసిడిపై రూ.2000 వరకు ఎక్కువగా ఉంది.
క్రితంసారి కంటే రూ.వెయ్యి ఎక్కువ
పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ బాండ్స్ మంచి స్కీం. ఇందులో పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి తమ పెట్టుబడిపై సంవత్సరానికి స్థిర వడ్డీ రేటు 2.5 శాతం పొందడంతో పాటు బంగారం ధరలు పెరుగుతున్నా కొద్ది ఆ ప్రయోజనం ఉంటుంది. అంతకుముందు 2020 డిసెంబర్ 28 నుండి 2021 జనవరి 1వ తేదీ వరకు బాండ్స్ సిరీస్ IX సబ్స్క్రిప్షన్ రూ.5000గా ఉంది. ఇప్పుడు రూ.5104గా ఉంది. 10 గ్రాముల పసిడిపై క్రితం సారి రూ.50,000గా ఉంటే, ఈసారి రూ.51,040గా ఉంటుంది. అంటే క్రితంసారి కంటే రూ.వెయ్యి పెరిగింది.
వడ్డీ.. చెల్లింపు
గోల్డ్ బాండ్స్ను గ్రాము బంగారం ధరతో మొదలు జారీ చేస్తారు. ఒక్కో బాండ్ ఒక్కో గ్రాము బంగారానికి సమానం. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధర ఆధారంగా మదుపర్లు బాండ్స్లో పెట్టుబడి పెట్టాలి. 999 స్వచ్ఛత బంగారం ధర సబ్స్క్రిప్షన్కు ముందు వారం చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటును లెక్కించి నిర్ణయిస్తారు. దరఖాస్తుదారు పాన్ నెంబర్ తప్పనిసరి. జారీ చేసిన బాండుపై పెట్టుబడిదారులకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు.
మెచ్యూరిటీ పీరియడ్
పెట్టుబడి పెట్టిన రోజు నుండి 8 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాలలో ఉన్న ధరకు సగటు లెక్కించి చెల్లింపులు జరుపుతారు. మెచ్యూరిటీ సమయం కంటే ముందు తీసుకోవాలంటే జారీ చేసిన రోజు నుండి 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత విత్ డ్రా చేసుకోవాలి. రుణ సదుపాయం ఉంటుంది. గోల్డ్ బాండ్స్ పైన వచ్చే వడ్డీ పైన పన్ను వర్తిస్తుంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది.