బంగారం ధర ఎందుకు పెరుగుతోంది, కొనుగోలు చేయవచ్చా.. ధర పడిపోవచ్చా?
నేడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ పర్వదినం మాత్రమే కాదు.. కరోనా మహమ్మారి నేపథ్యంలో అసలు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చా? అనేది చాలామందిని వేధించే ప్రశ్న. పసిడి ధర రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే రూ.12వేల వరకు పెరిగింది. ఇటీవలి కాలంలో స్థిరంగాలేదు. బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఈ అక్షయ తృతీయ బంపరాఫర్, ఇక ఇలా ఈజీగా బంగారం కొనేయండి
బంగారం మరింత పెరిగేనా?
2021 చివరి నాటికి బంగారం ధర ఏకంగా 10 గ్రాముల ధర రూ.82,000కు చేరుకోవచ్చునని కూడా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 2,000 డాలర్ల నుండి3,000 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఒకవేళ అంత పెరగకపోయినా పెరుగుదల మాత్రం ఖాయంగా ఉంటుందని భావిస్తున్నారు. భారీగా తగ్గే అవకాశాలు మాత్రం ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
పలు దేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో పాటు ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ద్రవ్య లోటు ప్రధాన సమస్యలుగా మారనున్నాయని భావిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చమురు ధరలు స్థిరంగా లేవు. పైగా జనవరి కంటే భారీ తగ్గుదల నమోదు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సహజంగానే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ధర పెరిగి ఇన్వెస్టర్లు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. బంగారం పెరుగుతుందని వివిధ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి.
అక్షయ తృతీయ నుండి అక్షయ తృతీయ వరకు.. 43%
ఇప్పటికే ఫండ్ మేనేజర్లు తమ పెట్టుబడుల్లో ఎక్కువ మొత్తాన్ని బంగారానికి కేటాయిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. డాలర్ల పరంగా గత ఏడాది బంగారం ధర 14శాతం పెరిగిందని, మన కరెన్సీలో గత ఏడాది అక్షయ తృతీయ నుండి ఈ అక్షయ తృతీయ వరకు దాదాపు 43 శాతం పెరిగిందని కొటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు శేఖర్ అంటున్నారు. బంగారం దుకాణాలు మూతబడి కొనుగోళ్లు భారీగా తగ్గినప్పటికీ చేతిలోని బంగారం ధర మాత్రం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం రూ.33 వేలకు అటు ఇటుగా ఉంది. ఇప్పుడు రూ.46,000కు చేరుకుంది. 10 గ్రాములు సమీప భవిష్యత్తులో రూ.52,000కు కూడా చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిమాండ్తో పాటు ధర పెరుగుదల
బంగారం పెట్టుబడికి డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ సంస్థ ఎస్పీడీఆర్ గోల్డ్ హోల్డింగ్స్ వద్ద బంగారం నిల్వలు పెరుగుతూ ఉన్నాయి. తద్వారా బంగారానికి అధిక డిమాండ్ ఉందని అర్థమవుతోందని చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో బంగారం నిల్వలు 8 శాతం పెరిగాయి. గత ఏడాది కాలంలో చూస్తే దాదాపు 17 శాతం పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడికి అధిక డిమాండ్ ఉండటంతో పాటు ధర పెరుగుతుందని అంచనా.
పతనమయ్యే అవకాశం.. కానీ
గత ఏడాది బంగారం ధర 23 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాదిలో కూడా భారీ పెరుగుదల నమోదయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారట. తమ పోర్ట్ పోలియోలో ఇతర పెట్టుబడులను తగ్గించుకొని బంగారానికి పెంచుతున్నారు. ఏడాదిగా బంగారం ధర భారీగా పెరుగుతోందని, ఏదో ఒక సందర్భంలో ఒక్కసారిగా పతనం అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇది తాత్కాలికం. దీర్ఘకాలంలో మాత్రం మంచి పెట్టుబడి మార్గంగా చెబుతున్నారు.