SBI customers alert! అప్డేట్ చేయకుంటే మే 31 తర్వాత ఖాతాల నిలిపివేత
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. KYC(నో యువర్ కస్టమర్) వివరాలను అప్ డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, ఈ అప్ డేట్ మే 31వ తేదీ లోపు పూర్తి చేయాలని లేదంటే ఖాతా సేవలు పాక్షికంగా నిలిపివేస్తామని SBI తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట లాక్ డౌన్, కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకు బ్రాంచీకి వచ్చి వివరాలు అప్ డేట్ చేయడం కష్టంగా మారింది. అందుకే బ్రాంచీకి వచ్చే అవసరం లేకుండా వివరాలు అప్ డేట్ చేసేందుకు అనుమతించింది.
అప్ డేట్ చేయాలి
కరోనా నేపథ్యంలో రెండు పద్ధతుల్లో KYC అప్ డేట్ కోసం వెసులుబాటు కల్పించింది. ఈ-మెయిల్ ద్వారా గానీ పోస్టల్ సేవల ద్వారా గానీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రెండు విధానాలలో మీకు నచ్చిన విధానం ద్వారా వివరాలు బ్యాంకు పంపిస్తే కేవైసీ అప్డేట్ చేస్తారు. కేవైసీ అనేది బ్యాంకులుతమ కస్టమర్లకు గుర్తింపు సమాచారాన్ని పొందే ప్రక్రియ. ఇది బ్యాంకు సేవలు దుర్వినియోగం కాకుండా చేస్తుంది. ఒక వ్యక్తి బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచినప్పుడు కేవైసీ నమోదు చేయాలి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి అప్ డేట్ చేయాలి.
ఎవరు ఎప్పుడు
సాధారణంగా ఎక్కువ రిస్క్ కలిగిన కస్టమర్లు రెండేళ్లకు ఒకసారి, మధ్యస్థ రిస్క్ కస్టమర్లు ఎనిమిదేళ్లకు, తక్కువ రిస్క్ కస్టమర్లు పదేళ్లకు ఓసారి కేవైసీ అప్డేట్ చేయాలి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బ్యాకింగ్ మోసాలను నివారించేందుకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని ఎస్బీఐ కోరింది. మిగిలిన బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశముంది.
డాక్యుమెంట్స్ ఇవే
కేవైసీకి కావాల్సిన డాక్యుమెంట్స్ గుర్తింపు లేదా అడ్రస్ రుజువుగా చూపించే పత్రాలు. పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఏ కార్డు, పాన్ కార్డు అవసరం.